: సౌదీ యువరాణి సాహసోపేత నిర్ణయం.... సౌదీలో జిమ్ ల ఏర్పాటుకు ఆదేశాలు

ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మహిళలు వాకింగ్, జాగింగ్, జిమ్, యోగా వంటివాటిని ఆచరిస్తున్నారు. అయితే, ధనిక దేశాలుగా పేరుపడ్డ గల్ఫ్ దేశాల్లో మాత్రం ఆడవారిపై ఎన్నో ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. అక్కడ మహిళలు ఒంటరిగా బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం నిషిద్ధం. జిమ్ లు, యోగా, ఎక్సర్‌ సైజ్‌, డ్రైవింగ్ వంటి వాటిని పోరాపాటున కూడా ఆచరించకూడదు. ఇవన్నీ అక్కడ నిషేధిత అంశాలు. దీంతో ఆయా దేశాల్లోని చాలా మంది మహిళలు సరైన శారీరక శ్రమకు నోచుకోక అనారోగ్యం బారిన పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

సౌదీలో చాలా మంది మహిళలు ఒబెసీటీ, డయాబెటిస్‌ లతో బాధపడుతున్నారు. దీంతో అప్రమత్తమైన సౌదీ యువరాణి రీమా బాందర్ సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చారు. కేవలం మహిళల కోసం జిమ్ లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. శారీరక శ్రమ కొరవడడం వల్ల పలువురు మహిళలు తీవ్రమైన వ్యాధులతో మరణిస్తున్నారని, శారీరక శ్రమ ద్వారా పలు సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయని చెబుతూ, శ్రమద్వారా వాటిని నిరోధించగలమని చెప్పారు. అందుకే మహిళల కోసం జిమ్ లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తద్వారా వ్యాధుల బారినుంచి వారిని వారు కాపాడుకోవడంతోపాటు క్రీడల్లో రాణించే అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. చట్టాల పేరుతో మహిళలను నియంత్రించడం సరికాదని ఆమె తెలిపారు. 

More Telugu News