: త్వరలోనే భారత్ వస్తా.. ఇప్పుడు నాకు బోల్డంతమంది స్నేహితులు!: ‘రియల్ హీరో’ గ్రిల్లోట్

అమెరికాలోని కాన్సస్‌లో జరిగిన జాత్యహంకార దాడిలో ప్రాణాలకు తెగించి కాల్పులకు అడ్డువెళ్లిన ఇయాన్ గ్రిల్లోట్ త్వరలోనే భారత్ వస్తానని పేర్కొన్నాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు తనకు లక్షలాదిమంది భారతీయులు స్నేహితులయ్యారని పేర్కొన్నాడు. వారిని కలిసేందుకు త్వరలోనే భారత్ వస్తానని తెలిపాడు.

శ్రీనివాస్ కూచిభొట్లపై జరిగిన కాల్పుల ఘటనను గుర్తుచేసుకున్న ఇయాన్.. తాను ప్రమాదంలో పడితే సాయం కోసం ఎలా అయితే చూస్తానో, వారు కూడా అలానే చూస్తున్నారని భావించి కాల్పులకు ఎదురు వెళ్లానన్నాడు. కాల్పులు జరిపిన హంతకుడు ప్యూరిన్టన్ తుపాకిలో తూటాలు అయిపోయాయని భావించానని, అయినా ఆ సమయంలో అతడిని అడ్డుకోవడం తప్ప మరో మార్గం కనిపించలేదన్నాడు. ప్యూరిన్టన్ చేసింది చాలా పెద్ద తప్పు అని పేర్కొన్న ఇయాన్ మనుషులంతా సమానమేనని వివరించాడు. కాన్సస్ దాడిలో శ్రీనివాస్ మృతి చెందగా అతడి స్నేహితుడు అలోక్ మాదసాని గాయపడ్డాడు. అడ్డుకోబోయిన ఇయాన్ చాతీ, చేతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి.

More Telugu News