: మహిళలపై కేరళ క్రైస్తవ మతబోధకుడు సంచలన వ్యాఖ్యలు.. వైరల్‌గా మారిన వీడియో!

కేరళకు చెందిన క్రైస్తవ మతబోధకుడు, పాస్టర్ సెర్మోన్ మహిళలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వైరల్ అయింది. అమ్మాయిలు.. పురుషులను రెచ్చగొట్టేలా దుస్తులు ధరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే  కొన్ని చర్చిల్లో ప్రార్థనలు చేయడం తనకు ఇష్టముండదని పేర్కొన్నారు. అలాంటి చోట్ల అమ్మాయిలు జీన్స్, టీషర్టులు ధరించి చేతిలో సెల్ పట్టుకుని జుట్టు కూడా సరిగా దువ్వుకోకుండా వచ్చి ముందువరుసలో కూర్చుంటారని వ్యాఖ్యానించారు. ఇది తనకు ఎంతమాత్రమూ నచ్చని విషయమన్నారు. అమ్మాయిలు ఇలా ఎందుకు చేస్తారో తనకు ఇప్పటికీ అర్థం కాదని పేర్కొన్నారు. అసలు అలాంటి దుస్తులు ధరించి చర్చికి రావొచ్చా? అంటూ సభకు వచ్చిన అమ్మాయిలను ప్రశ్నించారు.

అమ్మాయిల దుస్తులపై తనకు పిర్యాదులు కూడా అందాయన్నారు. చర్చిల వద్ద అలాంటి దుస్తులు ధరించి వచ్చిన అమ్మాయిలను చూస్తుంటే తమకు పాపం చుట్టుకుంటుందని తనకు ఫిర్యాదు చేసిన అబ్బాయిలు ఆవేదన వ్యక్తం చేసినట్టు సెర్మోన్ చెప్పుకొచ్చారు. చాలామంది మహిళలు పెళ్లి, ఉద్యోగం వంటి సమస్యలపై ఫిర్యాదు చేస్తారని, అయితే దానికి కారణం వారు ధరించే దుస్తులేనని వివరించారు. చుడీదార్లయితే అమ్మాయిలకు చాలా చక్కగా ఉంటాయన్నారు. అమ్మాయిల్లో సైతాను ప్రవేశించిందని, అందుకే వారు అటువంటి దుస్తులు ధరిస్తున్నారని పాస్టర్ సెర్మోన్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

 
 

More Telugu News