: చర్చించే దమ్ము లేక కావాలనే అరెస్ట్ చేయించుకుని వెళ్లిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి: శ్రీనివాసగౌడ్ ఎద్దేవా

తెలంగాణలో ఆంధ్ర నేతలకు చెందిన బస్సులు అక్రమంగా తిరుగుతున్నాయని అసెంబ్లీలో జరిగిన చర్చపై చర్చకు సిద్ధమని చెప్పిన దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డి, చర్చించే దమ్ము లేక వెనుదిరిగి పోయారని శ్రీనివాసగౌడ్ ఆరోపించారు. ఆయన బస్సులు స్టేజ్ కారియర్లుగా తిరుగుతున్నాయని, దానిపై మాట్లాడేందుకే తాను ఆధారాలతో వచ్చానని, కానీ ప్రభాకర్ రెడ్డి కావాలనే ఆర్టీయే కార్యాలయం బయటే గొడవకు దిగి, పోలీసులతో అరెస్ట్ చేయించుకుని వెనక్కు వెళ్లిపోయారని అన్నారు.

ప్రజలకు జరుగుతున్న అసౌకర్యం గురించి తాము మాట్లాడితే, అదేదో తమను వేధిస్తున్నట్టు ఆయన మాట్లాడారని అన్నారు. తాము కేవలం దివాకర్ ట్రావెల్స్ గురించి మాత్రమే ఆరోపణలు చేయడం లేదని, తప్పు చేసిన అన్ని ట్రావెల్స్ గురించి చెబుతున్నామని శ్రీనివాసగౌడ్ తెలిపారు. తెలంగాణ బస్సులపై ఆంధ్రాలో కేసులు పెడుతున్నారని, అక్కడి ప్రైవేటు ట్రావెల్స్ యజమానుల్లో అత్యధికులు అధికార పార్టీలో ఉండి, తప్పించుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అన్నీ సరైన డాక్యుమెంట్లు ఉన్నా తెలంగాణ బస్సులపై కేసులు పెడుతున్నారని, ఇక్కడ కేసులు పెడితే, ఆంధ్రా, తెలంగాణ గొడవలంటూ కొత్త వ్యాఖ్యానాలు చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News