: న్యాయం జరుగుతుందన్న ఆశతో ఇండియాకు తిరిగొచ్చిన అమెరికన్ యువతి!

తొమ్మిది నెలల క్రితం, భారత సందర్శనకు వచ్చి, ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ లో సామూహిక అత్యాచారానికి గురైన 25 సంవత్సరాల అమెరికన్ యువతి, తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో తిరిగి ఇండియాకు వచ్చింది. రేపిస్టులను గుర్తించేందుకు రావాలని పోలీసులు కోరడంతో, తాను వచ్చినట్టు బాధితురాలు వెల్లడించింది. తాను గత ఏప్రిల్ లో ఢిల్లీకి వచ్చిన వేళ, కన్నాట్ ప్లేస్ లోని ఓ హోటల్ కు తీసుకెళ్లిన టూర్ గైడ్, మంచి నీళ్ల బాటిల్ లో మత్తుమందు కలిపి ఇచ్చారని, ఆపై అతనితో సహా టూర్ కంపెనీ ఉద్యోగులు, హోటల్ సిబ్బంది రెండు రోజుల పాటు తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. తాను పెన్సిల్వేనియాలోని ఇంటికి తిరిగి వెళ్లిన తరువాత, ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో ఫిర్యాదు చేశానని, అమెరికా నుంచి ఫిర్యాదు చేస్తే, కేసు విచారణ కష్టమని తెలిసి ఇక్కడికి వచ్చానని పేర్కొంది. కాగా, ఈ కేసులో ఇప్పటివరకూ 11 మందిని విచారించామని, బాధితురాలు నిందితులను గుర్తిస్తేనే వారిని అరెస్ట్ చేస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి.

More Telugu News