: పాక్ ఉగ్రవాదానికి మరో సాక్ష్యం... ఆశ్రయం కోసం వచ్చి ఉగ్రదాడి చేసిన పాకిస్థాన్ వాసి

ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా పాకిస్థాన్ ఉందనడానికి మరో సాక్ష్యం లభించింది. బెర్లిన్ లో రద్దీగా ఉన్న క్రిస్మస్ మార్కెట్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి 12 మంది దారుణ మరణానికి కారణమైన వ్యక్తి పాక్ జాతీయుడని జర్మన్ అధికారులు 'ది వాషింగ్టన్ పోస్ట్' పత్రికకు స్పష్టం చేశారు. ఇతను గత ఫిబ్రవరిలో ఆశ్రయం కోరుతూ జర్మనీకి వచ్చాడని, అతనే దారుణానికి ఒడిగట్టాడని వెల్లడించారు. ఘటనా స్థలికి వంద గజాల దూరంలో అనుమానాస్పద వ్యక్తిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నామని, ట్రక్కు పోలెండ్ లో రిజిస్టరై ఉన్నట్టు తెలిసిందని అధికారులు పేర్కొన్నారు.

జర్మనీ కాలమానం ప్రకారం ఈ ఘటన సోమవారం రాత్రి 8 గంటల సమయంలో చారిత్రాత్మక కైజర్ వీహెల్మ్ మెమోరియల్ చర్చ్ సమీపంలోని పబ్లిక్ ప్లాజా వద్ద జరిగింది. మార్కెట్ స్టాల్స్ పైకి ట్రక్కు 80 అడుగుల దూరం దూసుకొచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఘటనలో గాయపడిన 48 మందిని వివిధ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించినట్టు అధికారులు తెలిపారు. ఆ ప్రాంత మేయర్ తో అధ్యక్షురాలు మెర్కెల్ మాట్లాడారని, సహాయక చర్యలను ఆమె పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.

More Telugu News