: విజయవాడలో అన్ని ఏటీఎంలలోను అందుబాటులో రూ.500 నోట్లు.. క్యూ కడుతున్న జనం

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం తరువాత ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల నుంచి వ‌స్తోన్న ఫిర్యాదుల‌ను ప‌రిశీలించి ప్ర‌జ‌ల‌ చిల్ల‌ర క‌ష్టాల‌ను తీర్చేందుకు అన్ని చ‌ర్య‌లూ వేగంగా చేప‌డుతోంది. భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు కొత్త 500 రూపాయ‌లతో పాటు 100, 50 రూపాయ‌ల‌ నోట్ల‌ను వీలైనంత త్వ‌ర‌గా బ్యాంకుల‌కు పంపిణీ చేస్తోంది. ఇప్ప‌టికే దేశంలోని అనేక ప్రాంతాల్లో కొత్త 500 రూపాయ‌ల నోట్ల‌ను ప్ర‌జ‌లు అందుకున్న విష‌యం తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కూడా కొత్త 500 రూపాయ‌ల నోట్లు చేరుకున్నాయి. విజయవాడలోని దాదాపు అన్ని ఏటీఎంలలో ఈ రోజు నుంచి రూ.500 నోట్లను ప్ర‌జ‌లు విత్ డ్రా చేసుకుంటున్నారు. అంతేగాక‌, కొత్త 100 రూపాయల నోట్లు కూడా ఏటీఎంల నుంచి వ‌స్తున్నాయి. ఏటీఎంల‌లో ఈ నోట్లు వ‌స్తున్నాయ‌ని తెలుసుకుంటున్న అక్క‌డి ప్ర‌జ‌లు వాటిని తీసుకునేందుకు భారీగా క్యూ కడుతున్నారు. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో రూ.500 నోట్లు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ కు రెండు రోజుల్లో రూ.500 నోట్లు చేరుకుంటాయని నిన్న అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఏటీఎం సామర్థ్యాలను కూడా పెంచారు. దీంతో ప్రజల చిల్లర కష్టాలు ఇక తగ్గుముఖం పట్టనున్నాయి.

More Telugu News