: రియో విజేత కోచ్ కు 'డమ్మీ చెక్కు' ఇచ్చి పోజులు కొట్టిన హర్యానా ప్రభుత్వం... కాళ్లరిగేలా తిరుగుతున్నా అసలు చెక్కివ్వని వైనం!

తమకు ప్రోత్సాహకంగా నగదు ఇస్తున్నామని చెప్పి, చెక్కు నకలు చేతికిచ్చి ఫోటోలకు పోజులిచ్చిన హర్యానా నేతలు, అసలు చెక్కును కాళ్లరిగేలా తిరిగినా ఇవ్వలేదని వాపోతున్నాడు ఒలింపిక్ పతక విజేత సాక్షీ మాలిక్ కోచ్ కుదదీప్ మాలిక్. రియో ఒలింపిక్స్ లో ఫ్రీ స్టయిల్ రెజలింగ్ లో భారత్ కు కాంస్య పతకాన్ని అందించిన క్రీడాకారిణి సాక్షి. పతకం కోసం ఆమె ఎంత శ్రమించిందో, ఆమెను అలా తయారు చేసేందుకు కోచ్ గా కులదీప్ మాలిక్ పడ్డ శ్రమ కూడా తక్కువేమీ కాదు. కులదీప్ కృషిని గుర్తిస్తున్నామని చెప్పిన హర్యానా పాలకులు, రియో నుంచి వెనక్కు వచ్చిన తరువాత గొప్ప సభ పెట్టి, రూ. 10 లక్షల చెక్కు ఫోటో కాపీని అందించారు. ఆపై సాక్షి మాలిక్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న వేళ, అక్కడే ఉన్న రైల్వే మంత్రి సురేష్ ప్రభు, కులదీప్ ను అభినందిస్తూ, చీఫ్ టికెట్ ఇనస్పెక్టర్ గా ప్రమోషన్ ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చారు. ఇక తనకు రావాల్సిన రూ. 10 లక్షల చెక్కు కోసం హర్యానా ప్రభుత్వాన్ని, ప్రమోషన్ కోసం రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డును ఎన్నిమార్లు కలిసినా న్యాయం జరగడం లేదని కులదీప్ వాపోయాడు. "సాక్షికి ఎన్నో పురస్కారాలు లభించాయి. సూపర్ లగ్జరీ బీఎండబ్ల్యూ కారును కూడా ఆమె అందుకుంది. నాకన్నా ఎక్కువగా సంతోషించేవాళ్లు ఎవరూ ఉండరు. ఇదే సమయంలో నాకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు. ఇందెంతో అసంతృప్తిని కలిగిస్తోంది" అని 2011 నుంచి ఆమెకు కోచ్ గా ఉన్న కులదీప్ పీటీఐ వార్తా సంస్థకు వివరించాడు. ఇప్పటివరకూ ఒక్క పైసా కూడా తనకెవరూ ఇవ్వలేదని, తనకు రావాల్సిన చెక్కు కోసం తిరుగుతున్నానని తెలిపాడు. ఇక ప్రమోషన్ కోసం అడిగితే, మంత్రి చెప్పినా, కోచ్ లకు ప్రమోషన్ ఇచ్చేది లేదని అంటున్నారని వాపోయాడు. తానేమీ అడుక్కోవడం లేదని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాత్రమే కోరుతున్నానని అన్నాడు.

More Telugu News