: పాకిస్థాన్‌కు ఆఫ్గాన్ గట్టి హెచ్చరిక.. పాకిస్థాన్ వాణిజ్య రవాణా మార్గాన్ని మూసేస్తామని వ్యాఖ్య

పాకిస్థాన్ కనుక వాఘా సరిహద్దును మూసేస్తే, మధ్య ఆసియాతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు పాక్ ఉపయోగించుకుంటున్న తమ దేశ వాణిజ్య రవాణా మార్గాన్ని మూసివేస్తామని ఆఫ్గనిస్థాన్ హెచ్చరించింది. ఆఫ్గనిస్థాన్ లో పాకిస్థాన్ రాయబారి ఓవెన్ జెంకిన్స్‌తో సమావేశం అనంతరం ఆఫ్గాన్ అధ్యక్షుడు ఆష్రాఫ్ ఘనీ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ‘‘వాఘా సరిహద్దును ఉపయోగించుకునేందుకు మా దేశ వ్యాపారులను అనుమతించకపోతే, మధ్య ఆసియా, ఇతర దేశాలకు ఎగుమతులు చేసేందుకు ఆ దేశం ఉపయోగించుకుంటున్న మా దేశ వాణిజ్య రవాణా మార్గాలను మూసివేస్తాం’’ అని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. పాకిస్థాన్ సహా ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో ఉన్న సాంకేతిక అడ్డంకులను తొలగించుకుని ఆర్థిక సహకారం పెంపొందించుకోవాలని ఆఫ్గనిస్థాన్ కోరుకుంటోందని పేర్కొన్నారు. అయితే ఆ దేశం మాత్రం పండ్ల సీజన్‌లో రవాణా మార్గాలను మూసి వేస్తోందని ఆరోపించారు. దీనివల్ల ఆఫ్గాన్ వ్యాపారులు మిలియన్ డాలర్లను నష్టపోతున్నారని ఘనీ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News