: బుందేల్ ఖండ్ కంటే మిన్నగా మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని కోరా: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ కు కేవలం ప్రత్యేక హోదా మాత్రమే చాలదని... ఇంకా న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి చెప్పినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని తొలిసారి వంద నిమిషాల పాటు రాష్ట్రంపై చర్చించినట్టు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అభివృద్ధిపై ప్రజలింకా భయభ్రాంతుల్లో ఉన్నారన్నారు. రాజధాని, పరిశ్రమలు, విద్యాసంస్థలు ఏమీ లేవని... ఇటువంటి పరిస్థితుల్లో బుందేల్ ఖండ్ కంటే మిన్నగా మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని కోరినట్టు వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో రాజీలేని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తుంగభద్ర, ఆల్మట్టి ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తున్నామన్న చంద్రబాబు, పోలవరం కుడికాల్వను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పట్టిసీమ పూర్తిచేసి రాయలసీమకు నీరిస్తామన్నారు. కాంగ్రెస్, వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరాటపడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేసింది ముమ్మాటికీ కాంగ్రెస్సేనని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా నిరోధించే శక్తులే ఇప్పుడు తన గురించి మాట్లాడుతున్నాయని, వాళ్లు లూటీ చేసిన సొమ్ము ప్రజలకు చెందాలని తెలిపారు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను రాష్ట్రం రాబట్టుకుంటుందన్నారు.

More Telugu News