: తలతీసి పెట్టొచ్చట!

మన తల తీసేసి వేరొకరి తలను మనకు పెట్టేందుకు అవకాశం ఉంటుందా... అంటే భవిష్యత్తులో ఉండే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు మన శరీరంలోని పలు ముఖ్యమైన అవయవాలను మార్పిడి చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో తలను తీసేసి వేరొకరి తలను ఆ స్థానంలో మార్పిడి చేసే వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందుతుందని ఒక శాస్త్రవేత్త చెబుతున్నారు.

ట్యూరిన్‌లోని అడ్వాన్స్‌ న్యూరో మాడ్యులేషన్‌ గ్రూప్‌కు చెందిన డాక్టర్‌ సెర్జియో కానవెరో మాట్లాడుతూ సెల్‌ ఇంజినీరింగ్‌లోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇది సాధ్యం చేయవచ్చని చెబుతున్నారు. పెరుగుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మరో రెండేళ్లకు తల మార్పిడి సాధ్యమవుతుందని సెర్జియో అంటున్నారు. తాను అభివృద్ధి చేసిన 'హెడ్‌ అనాస్టొమోసిస్‌ వెంచర్' (హెవెన్‌) అనే శస్త్రచికిత్స ప్రక్రియ గురించి ఆయన సర్జికల్‌ న్యూరాలజీ ఇంటర్నేషనల్‌ అనే వైద్య పత్రికలో వివరించారు. ఈ వివరణ ప్రకారం ఇద్దరు మనుషుల తలలను అత్యంత సున్నితమైన బ్లేడు సాయంతో తొలగిస్తారు. తర్వాత ఒక ప్రత్యేకమైన పాలీమర్‌ జిగురు సాయంతో దాత తలను గ్రహీత శరీరానికి అతికిస్తారు. ఎలక్ట్రోప్యూజన్‌ అనే పద్ధతి ద్వారా ఇలా తలనూ, శరీరాన్ని రెండింటినీ అనుసంధానిస్తారు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగు పరచడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తున్నానని, రెండేళ్లలో ఇది సిద్ధమయ్యే అవకాశం ఉందని సెర్జియో అంటున్నారు.

More Telugu News