టీఎంసీకి షాక్.. బీజేపీలోకి ముగ్గురు రాజ్యసభ మాజీ ఎంపీలు.. చేరిన రోజే రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటన!

  • టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ముగ్గురు రాజ్యసభ మాజీ సభ్యులు
  • తాము రాజీనామా చేసిన స్థానాల ఉప ఎన్నికలకే బీజేపీ అభ్యర్థులుగా ఎంపిక
  • 24న జరగబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం దాదాపు ఖాయం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గురువారం రాత్రి ఊహించని సంచలనం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ మాజీ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాష్ చిక్ బారాయిక్ అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. గత నెలలోనే వీరు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వీరికి కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా, వారు రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరిని తమ అభ్యర్థులుగా ప్రకటిస్తూ గురువారం అర్ధరాత్రి బీజేపీ అధిష్ఠానం ఒక ప్రకటన విడుదల చేసింది.

పార్టీ మారిన ముగ్గురు నేతల్లో సుఖేందు శేఖర్ రాయ్ చాలా సీనియర్. 2024 ఆగస్టులో కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణ హత్యాచార ఘటన విషయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. నాటి నుండి పార్టీ అధిష్ఠానం ఆయనను పక్కనబెట్టింది. దీంతో గత నెల 8న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జూన్ 10న సుస్మితా దేవ్, 11న ప్రకాష్ చిక్ బారాయిక్ కూడా రాజీనామాలు సమర్పించారు. తాజాగా వీరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

జులై 24న జరగబోయే ఈ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీకి 208 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక్కడ ఒక ప్రతిపక్ష అభ్యర్థి గెలవాలంటే కనీసం 70 ఓట్లు అవసరం అవుతాయి. అధికారికంగా తృణమూల్ కాంగ్రెస్‌కు 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, అందులో 60 మంది తిరుగుబాటు నేత రితబ్రత బెనర్జీ వర్గంలో ఉన్నారు. కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల అసలైన మైనారిటీ వర్గంలో మిగిలారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

BJP
Sukhendu Sekhar Roy
TMC
West Bengal politics
Rajya Sabha elections
Sushmita Dev

More Telugu News