గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం... కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్టు

  • విజయవాడలో యువకుడు సాయికృష్ణ అదృశ్యంపై విచారణ
  • నాగరాజును అదుపులోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం
  • సీఐ అరెస్టును అడ్డుకునేందుకు మద్దతుదారుల ప్రయత్నం
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ (25) అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), సస్పెన్షన్‌కు గురైన కృష్ణలంక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎస్‌వీవీ నాగరాజును అదుపులోకి తీసుకుంది.

గత మే 9న కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడని బాధితుడి తల్లి విజయలక్ష్మి ఆరోపించారు. పోలీసులు తన కుమారుడిని చిత్రహింసలకు గురిచేసి చంపేసి, మృతదేహాన్ని మాయం చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతో పాటు సమగ్ర విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలో, సీఐ నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం వంటి అభియోగాలతో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మంగళవారం సిట్ అధికారులు విజయవాడ సింగ్ నగర్‌లోని నాగరాజు నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, నాగరాజును విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి తరలించారు. అక్కడ సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఆయనను అరెస్టు చేశారు. నాగరాజు అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని సిట్ అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు అందించారు.

Gade Saikrishna
CI Nagaraju
Krishnalanka CI arrest
SIT investigation Andhra Pradesh
Gade Saikrishna missing case

More Telugu News