జగన్ చుట్టూ తిరిగేలా కాపు నేతలను ఉచ్చులోకి లాగుతున్నారు: వైసీపీపై మంత్రి నిమ్మల ఫైర్

  • కులాలు, మతాల మధ్య జగన్ చిచ్చుపెడుతున్నారన్న జగన్
  • అంబటి, పేర్ని నాని, గుడివాడ అమర్‌నాథ్ లాంటి వారితో తప్పులు చేయించారని విమర్శ
  • పాస్టర్లను అడ్డుపెట్టుకుని మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశారని మండిపాటు

ఎన్నికల ఓటమి నిరాశతో వైసీపీ అధినేత జగన్... రాష్ట్రంలో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీలో ఉన్న కాపు నేతలను రెచ్చగొట్టి, వారితో తప్పులు చేయించి, జైలుకు పంపేలా జగన్ అండ్ కో స్కెచ్ వేస్తోందని ఆరోపించారు. 


"శ్రీలక్ష్మి, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్‌నాథ్ లాంటి వారితో జగన్ తప్పులు చేయించారు. కొందరిని జైలుకు పంపడం ద్వారా వారు తన ఉచ్చు లోంచి అంత త్వరగా బయటకు రాలేక, జీవితాంతం పులివెందుల అజెండా చుట్టూ తిరిగేలా చేస్తున్నారు. నేరస్థులను తయారు చేసే కర్మాగారం గొడ్డలి పార్టీది అయితే.. బలమైన లీడర్లను తయారు చేసే కర్మాగారం టీడీపీది" అని అన్నారు.


సాక్షాత్తు కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేయాలనుకున్నందుకే గత ఎన్నికల్లో ఆ దేవుడు వైసీపీకి ఘోర పరాజయాన్ని ఇచ్చి శిక్షించాడని నిమ్మల వ్యాఖ్యానించారు. పాస్టర్ ప్రవీణ్, కడప పాస్టర్ అభినయ్‌లను అడ్డుపెట్టుకుని మతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ చూసినా ప్రజలు నమ్మలేదన్నారు. గతంలో చదలవాడ, ఆదికేశవులు నాయుడు లాంటి వారికి టీటీడీ చైర్మన్ పదవులు ఇచ్చి టీడీపీ గౌరవిస్తే.. జగన్ మాత్రం తన సొంత బంధువులైన భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకే అవకాశాలు ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు.


బ్రిటిష్ కాలంలో ఉన్న కాపుల రిజర్వేషన్‌ను నీలం సంజీవరెడ్డి తొలగించారని... దామోదరం సంజీవయ్య ఇచ్చిన కాపు రిజర్వేషన్‌లను కాసు బ్రహ్మానందరెడ్డి తొలగించారని చెప్పారు. ఆ తర్వాత కాపుల చరిత్రలో మళ్లీ రిజర్వేషన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం EWS కాపు రిజర్వేషన్‌లను జగన్ అధికారంలోకి రాగానే రద్దు చేసి ‘కాపు ద్రోహి’గా మిగిలిపోయారని మండిపడ్డారు. రామలక్ష్మణుల లాంటి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాంబోను విడదీయడం ఎవరితరం కాదన్నారు.


Nimmala Ramanaidu
YS Jagan Mohan Reddy
Kapu Reservations
Andhra Pradesh Politics
YSRCP
Chandrababu Naidu

More Telugu News