టీమిండియాకు షాక్‌.. ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ సిరీస్‌ల నుంచి నితీశ్‌ ఔట్‌

  • గాయంతో నితీశ్‌ కుమార్‌ రెడ్డి దూరం
  • ఎడమ తొడ కండరాల్లో వాపు, ఫైబర్‌ డ్యామేజ్‌ గుర్తింపు
  • కనీసం నాలుగు వారాలు క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం
  • నితీశ్‌ స్థానంలో సూర్యాంశ్‌ షెడ్గే ఎంపికయ్యే ఛాన్స్‌
  • ఇప్పటికే గాయంతో దూరమైన ఆల్‌రౌండర్‌ పాండ్య
ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ పర్యటనలకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి గాయంతో ఈ టూర్ల నుంచి తప్పుకున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో అతడికి ఎడమ తొడ కండరాలు గాయం కావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఎంఆర్ఐ స్కాన్‌లో కండరాల వాపుతో పాటు ఫైబర్‌ డ్యామేజ్‌ ఉన్నట్లు తేలిందని బీసీసీఐ వైద్య బృందం వెల్లడించింది. దీంతో నితీశ్‌ను బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు పిలిపించి మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నారు. కనీసం నాలుగు వారాల పాటు అతడు క్రికెట్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది.

హార్దిక్‌ పాండ్యా కూడా తొడకండరాల గాయంతో ఇంకా కోలుకోకపోవడంతో జట్టులో నితీశ్‌ ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని అంతా భావించారు. ఇప్పుడు అతడు కూడా దూరం కావడం సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. ఇప్పటివరకు నితీశ్‌ భారత్‌ తరఫున 10 టెస్టులు, 6 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

నితీశ్‌ స్థానంలో యువ ఆల్‌రౌండర్‌ సూర్యాంశ్‌ షెడ్గేను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై-నేషన్‌ ‘ఏ’ సిరీస్‌లో అతడు ఐదు మ్యాచ్‌ల్లో 147 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. బంతితో రెండు వికెట్లు కూడా పడగొట్టాడు.

స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి కూడా గాయం కారణంగా ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు హామ్‌స్ట్రింగ్‌ గాయం నుంచి కోలుకుంటున్న విరాట్‌ కోహ్లీకి ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌ జట్టులో చోటు దక్కింది. ఫిట్‌నెస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే అతడు జట్టులో చేరనున్నాడు.

Nitish Kumar Reddy
India England Series
India Ireland Series
BCCI Injury Update
Suryansh Shedge
Varun Chakravarthy Injury

More Telugu News