నీట్ విద్యార్థులు ఆ సౌకర్యం వినియోగించుకోవడం చూశాక మనసంతా ఆనందంతో నిండిపోయింది: పొన్నం ప్రభాకర్

  • రీ-నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం
  • వేలాది మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని మంత్రి వెల్లడి
  • ఇది విద్యార్థుల సంక్షేమానికి నిదర్శనమన్న మంత్రి పొన్నం ప్రభాకర్
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయమని ప్రశంస
నేడు జరిగిన రీ-నీట్ పరీక్ష సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వేలాది మంది విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేక సౌకర్యం ద్వారా విద్యార్థులు ఎలాంటి రవాణా ఇబ్బందులు లేకుండా సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారని ఆయన తెలిపారు. నీట్ విద్యార్థులు ఉచిత ప్రయాణ సౌకర్యం వినియోగించుకోవడం చూశాక మనసంతా ఆనందంతో నిండిపోయిందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.

విద్యార్థుల ఉన్నత లక్ష్యాల సాధనలో వారికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజా పాలనలో భాగంగా విద్యార్థుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Ponnam Prabhakar
Telangana RTC Free Bus
NEET Exam Students
Revanth Reddy
Telangana Government
TSRTC Free Travel

More Telugu News