నీట్ విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని... ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీ గంట సేపు వెయిటింగ్!

  • నేడు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్
  • నీట్ విద్యార్థుల కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయిన ప్రధాని మోదీ
  • ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం
  • పరీక్ష ప్రారంభమయ్యాకే తన నివాసానికి బయలుదేరిన వైనం
  • దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా హాజరవుతున్న నీట్ రీ-ఎగ్జామ్
  • భయం లేకుండా పరీక్ష రాయాలని విద్యార్థులకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచన
ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల పట్ల తనకున్న ప్రత్యేక శ్రద్ధను మరోసారి చాటుకున్నారు. నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో, ఆయన ఢిల్లీ విమానాశ్రయంలోనే దాదాపు గంటసేపు వేచి ఉన్నారు. ఈ సంఘటన ఆయన మానవతా దృక్పథాన్ని తెలియజేస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కోల్‌కతాలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఆదివారం మధ్యాహ్నం 1:15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన నేరుగా తన అధికారిక నివాసానికి వెళ్లాల్సి ఉంది.

అయితే, మధ్యాహ్నం 2 గంటలకు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రారంభం కానుండటంతో, తన కాన్వాయ్ కారణంగా రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయి విద్యార్థులు ఇబ్బంది పడతారని ప్రధాని భావించారు. దీంతో పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని, ఆయన విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా అక్కడే వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత, అంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాతే ఆయన తన నివాసానికి బయలుదేరారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు కట్టుదిట్టమైన భద్రత నడుమ నీట్ రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎలాంటి ఆందోళన, భయం లేకుండా పరీక్ష రాయాలని సూచించారు. జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్టీఏ), రాష్ట్ర ప్రభుత్వాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, యువత భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Narendra Modi
NEET Exam
Delhi Airport
NEET Students
Dharmendra Pradhan
International Yoga Day

More Telugu News