ఇండియన్స్‌ పాత ఫోన్‌లు అమ్మట్లేదట.. కారణం ధర కాదు!

  • పాత ఫోన్లు అమ్మేందుకు 70% మంది వెనుకడుగు
  • వ్యక్తిగత డేటాపైనే ప్రధాన ఆందోళన
  • ధర కంటే భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం
  • ఫ్యాక్టరీ రీసెట్‌పై పూర్తి నమ్మకం లేదు
  • డేటా డిలీషన్‌ సర్టిఫికెట్‌కు భారీ మద్దతు
పాత స్మార్ట్‌ఫోన్‌ ఇంట్లో మూలన పడేయడం చాలా మందికి అలవాటే. కొత్త ఫోన్‌ కొన్న తర్వాత పాతది అమ్మేయొచ్చు. ఎక్స్‌ఛేంజ్‌ కూడా చేసుకోవచ్చు. అయినా చాలామంది ఆ అడుగు వేయడం లేదు. కారణం ధర కాదు. ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లిపోతుందన్న భయమే.

డేటాపైనే ఎక్కువ ఆందోళన
క్యాషిఫై నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 8 వేల మంది అభిప్రాయాలు సేకరించారు. అందులో దాదాపు 70 శాతం మంది పాత ఫోన్‌ అమ్మడానికి వెనుకాడుతున్నట్లు చెప్పారు. 75 శాతం మందికి తమ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుందన్న ఆందోళన ఉంది. బ్యాంక్‌ వివరాలు, ఫొటోలు, పాస్‌వర్డ్‌లు ఫోన్‌లో ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించారు.

అమ్మకాలు పెరిగినా భయం తగ్గలేదు
సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా ఇప్పటికే ఫోన్‌ను అమ్మినట్లు లేదా ఎక్స్‌ఛేంజ్‌ చేసినట్లు చెప్పారు. అంటే రీసేల్‌ మార్కెట్‌ పెరుగుతోందన్న మాట. కానీ అదే స్థాయిలో భద్రతపై సందేహాలు కూడా పెరుగుతున్నాయి. ఫోన్‌ అమ్మే వేదికను ఎంచుకునేటప్పుడు 45 శాతం మంది డేటా భద్రతకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి ధర ముఖ్యం అని చెప్పిన వారు 29.5 శాతమే ఉండటం గమనార్హం.

ఫ్యాక్టరీ రీసెట్‌పై నమ్మకం తగ్గుతోంది
పాత ఫోన్‌ ఇచ్చే ముందు 83 శాతం మంది ఫ్యాక్టరీ రీసెట్‌ చేస్తున్నట్లు తెలిపారు. అయితే అదే సమయంలో 41 శాతం మందికి అది పూర్తిగా డేటాను తొలగించదన్న అవగాహన ఉంది. మరో ముగ్గురిలో ఒకరు గతంలో డిలీట్‌ చేసిన సమాచారాన్ని తిరిగి పొందిన అనుభవం ఉందని చెప్పారు. దీంతో ఫ్యాక్టరీ రీసెట్‌పైనే ఆధారపడటం సరిపోదన్న భావన పెరుగుతోంది.

కావాల్సింది ధ్రువీకరించిన డేటా తొలగింపే
సర్టిఫైడ్‌ డేటా డిలీషన్‌ సౌకర్యం ఉంటే రీసేల్‌ ప్లాట్‌ఫామ్‌లపై మరింత నమ్మకం పెరుగుతుందని 69 శాతం మంది చెప్పారు. డేటా పూర్తిగా తొలగించామని తెలిపే సర్టిఫికెట్‌ చాలా ముఖ్యమని 83 శాతం మంది అభిప్రాయపడ్డారు. అవసరమైతే ఇందుకోసం అదనపు చార్జీ చెల్లించడానికి కూడా సగానికి పైగా మంది సిద్ధంగా ఉన్నారు. స్మార్ట్‌ఫోన్‌ రీసేల్‌లో డేటా భద్రతపై కఠిన నిబంధనలు అవసరమని 87.2 శాతం మంది కోరారు.

More Telugu News