తెలంగాణపై ఫుల్ ఫోకస్.. హైదరాబాద్ లో జనసేన కార్యాలయాన్ని నేడు ప్రారంభించనున్న పవన్

  • తెలంగాణలో దూకుడు పెంచుతున్న జనసేన
  • జీహెచ్ఎంసీ ఎన్నికలే తొలి లక్ష్యంగా అడుగులు
  • మణికొండలో పార్టీ కార్యాలయాన్ని నేడు ప్రారంభించనున్న పవన్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ... ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన తెలంగాణపై తన రాజకీయ దృష్టిని కేంద్రీకరించింది. పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరికొత్త వ్యూహాలతో దూకుడు పెంచారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని ఈరోజు ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా ఈ కొత్త ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


తెలంగాణలో జనసేన పార్టీ ఉనికిని చాటుకునేందుకు, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను సమాయత్తం చేసేందుకు తానే స్వయంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఏపీలో సాధించిన విజయ ఉత్సాహంతో తెలంగాణలోనూ పార్టీని ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మణికొండ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ తెలంగాణ పొలిటికల్ రోడ్ మ్యాప్‌పై ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారనేది సర్వత్ర ఆసక్తికరంగా మారింది.


Pawan Kalyan
Jana Sena Party
Hyderabad
Telangana Politics
Manikonda Office
GHMC Elections

More Telugu News