ఓటమి నాలో కసి పెంచింది.. మంగళగిరి అభివృద్ధిపై లోకేష్ భావోద్వేగం

  • మంగళగిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చిదిద్దుతానన్న లోకేష్
  • జగన్ బెంగళూరులో కాకుండా ఏపీలో నివసిస్తే వాస్తవాలు తెలుస్తాయని చురక
  • జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరని వ్యాఖ్య
  • కావాలనే వైసీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆరోపణ
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిని అన్ని రంగాల్లో నెం.1గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. బుధవారం మంగళగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, గెలిచిన మొదటి రోజు నుంచే అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నామని తెలిపారు.

2019లో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు కలిగిన బాధ, ఆవేదన తనలో కసి పెంచిందని లోకేష్ గుర్తుచేసుకున్నారు. ఆ కసితోనే ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నానని, 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజలు తనకు కొండంత అండగా నిలిచారని పేర్కొన్నారు. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో సుమారు రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, భూగర్భ విద్యుత్ లైన్లు, తాగునీరు, గ్యాస్ పైప్ లైన్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కృషితో కేంద్రం నుంచి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వంద పడకల ఆసుపత్రి, పార్కులు, కమ్యూనిటీ భవనాలు, స్మశాన వాటికల అభివృద్ధి వంటి పనులు వేగంగా చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "పులివెందుల ఎమ్మెల్యే బెంగళూరులో కాకుండా ఏపీలో నివసిస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఆయన వారంలో మూడు రోజులు బెంగళూరు, ఒకరోజు తాడేపల్లి, మరో మూడు రోజులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. అందుకే ఆయనను 'బెంతహై' (బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్) అని పిలవాల్సి వస్తోంది" అని ఎద్దేవా చేశారు. విజనరీకి, ప్రిజనరీకి చాలా తేడా ఉంటుందని, ప్రిజనరీ ఆలోచనలు ఎప్పుడూ జైలు చుట్టూనే తిరుగుతాయని విమర్శించారు. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన లోకేష్, "గొడ్డలి బ్యాచ్‌కు మహిళలను గౌరవించే సంస్కారం లేదు" అని మండిపడ్డారు.

డీఎస్సీ నోటిఫికేషన్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణలను లోకేష్ తిప్పికొట్టారు. "జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీ ప్రక్రియను ఆపలేరు. కూటమి ప్రభుత్వం కేవలం 150 రోజుల్లోనే 16 వేల టీచర్ పోస్టులు భర్తీకి శ్రీకారం చుట్టింది. హారిజాంటల్ రిజర్వేషన్ గురించి అవగాహన లేని వైసీపీ నేతలే కోర్టుల్లో 240 కేసులు వేసి అడ్డుకుంటున్నారు. డీఎస్సీపై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం" అని సవాల్ విసిరారు. నిడమర్రు ఆర్వోబీని 18 నెలల్లో పూర్తి చేస్తామని, మంగళగిరిని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని లోకేష్ పునరుద్ఘాటించారు.

Nara Lokesh
Mangalagiri development
Andhra Pradesh IT Minister
YS Jagan Mohan Reddy
DSC teacher recruitment

More Telugu News