క్షమాపణ చెప్పాలి, కోటి కట్టాలి.. స్టాలిన్‌కు టీవీకే నేత లీగల్ నోటీసు

  • మాజీ సీఎం స్టాలిన్‌కు టీవీకే నేత ఆదవ్ అర్జున లీగల్ నోటీసు
  • డ్రగ్స్ కేసుతో తనకు సంబంధాలు అంటగట్టారని ఆరోపణ
  • 48 గంటల్లో క్షమాపణ చెప్పి, రూ. కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్
  • లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • తమిళనాట డీఎంకే, టీవీకే మధ్య ముదురుతున్న రాజకీయ వివాదం
తమిళనాడు రాజకీయాల్లో మరో తీవ్ర వివాదం రాజుకుంది. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుతో తనకు సంబంధం ఉందంటూ నిరాధార ఆరోపణలు చేశారంటూ తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత ఆదవ్ అర్జున.. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు, డీఎంకే ఐటీ వింగ్‌కు లీగల్ నోటీసు పంపారు. 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అరెస్ట్ చేసిన జాన్ బ్రిట్టో అనే వ్యక్తితో తనకు సంబంధాలు అంటగడుతూ డీఎంకే, దాని అనుబంధ విభాగాలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని ఆదవ్ అర్జున తన నోటీసులో ఆరోపించారు. ఈ నిరాధారమైన, కల్పితమైన ఆరోపణల వల్ల తన ప్రతిష్ఠ‌కు తీవ్ర భంగం వాటిల్లిందని, తాను మానసిక వేదనకు గురయ్యానని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తనను నేర కార్యకలాపాలతో ముడిపెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో డీఎంకే ఐటీ వింగ్‌తో పాటు ఎంకే స్టాలిన్ కూడా తనకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదవ్ అర్జున డిమాండ్ చేశారు. నోటీసు అందుకున్న 48 గంటల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని గడువు విధించారు. క్షమాపణతో పాటు తన పరువుకు కలిగించిన నష్టానికి, మానసిక క్షోభకు గాను రూ. 1 కోటి పరిహారంగా చెల్లించాలని కూడా నోటీసులో కోరారు.

తాను నిర్దేశించిన గడువులోగా క్షమాపణ చెప్పి, పరిహారం చెల్లించడంలో విఫలమైతే.. స్టాలిన్‌తో పాటు ఈ ఆరోపణల వ్యాప్తికి కారణమైన ప్రతి ఒక్కరిపైనా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ఆదవ్ అర్జున స్పష్టం చేశారు. ఈ లీగల్ నోటీసుతో తమిళనాట డీఎంకే, నూతనంగా ఏర్పాటైన టీవీకే మధ్య రాజకీయ ఘర్షణ మరింత ముదిరినట్టయింది. ఈ వివాదం రాబోయే రోజుల్లో న్యాయపోరాటానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Aadhav Arjuna
MK Stalin
TVK
Legal Notice
Drug Smuggling Allegations
Tamil Nadu Politics

More Telugu News