రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఢిల్లీలో పోస్టర్లు
- ఇండియా కూటమి సమావేశం జరుగుతున్న వేళ కీలక పరిణామం
- ఢిల్లీ ప్రధాన కూడళ్లలో రాహుల్ కి వ్యతిరేకంగా పోస్టర్లు
- రాహుల్ గాంధీకి నిలకడ లేదంటూ సెటైరిక్ పోస్టర్లు
ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలక సమావేశం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ప్రధాన కూడళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీకి రాజకీయ నిలకడ లేదని, తాము కాంగ్రెస్ పార్టీపై ఆధారపడబోమంటూ కూటమి నేతలే అంటున్నట్లు ఆ పోస్టర్లలో పేర్కొనడం గమనార్హం. శరద్ పవార్, ఎం.కే. స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి కీలక నేతల ఫొటోలతో ఈ వివాదాస్పద పోస్టర్లను ముద్రించారు.
మరోవైపు, ఐక్యతను చాటడం, భవిష్యత్తు వ్యూహాలను మార్చుకోవడమే ప్రధాన అజెండాగా ఇండియా కూటమి సమావేశం కొనసాగింది. ఈ భేటీకి కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ, రాహుల్, ఖర్గేలతో పాటు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ హాజరయ్యారు. ఉద్ధవ్ ఠాకరే వర్చువల్గా పాల్గొన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతీయ పార్టీల ఓటమి, కూటమిలో తలెత్తిన అంతర్గత విభేదాలను సరిచేసుకుంటూ.. బీజేపీని బలంగా ఢీకొట్టేందుకు సరికొత్త వ్యూహాలను సిద్ధం చేయడంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
అయితే, ఈ కీలక సమావేశానికి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగా ఉండటం గమనార్హం. కూటమి నుంచి తప్పుకోవాలనే ఆలోచనతోనే ఈ రెండు పార్టీలు హాజరుకాలేదని తెలుస్తోంది.