ఆర్బీఐ కీలక నిర్ణయం.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
- ఆర్బీఐ నిర్ణయంతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- FY27 జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతానికి తగ్గించిన కేంద్ర బ్యాంకు
- రూపాయికి మద్దతుగా పలు కీలక చర్యలు ప్రకటించిన ఆర్బీఐ
మూడు రోజుల సమీక్షా సమావేశం అనంతరం, రెపో రేటును 5.25 శాతం వద్దే స్థిరంగా ఉంచాలని ఎంపీసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతర్జాతీయ అనిశ్చితులు, దేశీయ వృద్ధికి సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ఇంధన ధరలు, రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ఇదే క్రమంలో, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్బీఐ జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతానికి తగ్గించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆహార ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు వృద్ధికి ప్రతికూలంగా మారతాయని పేర్కొంది. అదేవిధంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది.
మరోవైపు, రూపాయి విలువను సుస్థిరం చేసేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్బీఐ పలు కీలక చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎన్నారైలు, ఓసీఐల ఈక్విటీ పెట్టుబడి పరిమితులను పెంచడం, ప్రభుత్వ సెక్యూరిటీలలో మరిన్ని దీర్ఘకాలిక బాండ్లను చేర్చడం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ సానుకూల ప్రకటనలతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ బలపడింది.