198 ఎకరాల భూమి... విలువ రూ.30 వేల కోట్లు... కాపాడిన హైడ్రా!

  • పుప్పాలగూడలో 198 ఎకరాల ప్రభుత్వ భూమికి కంచె
  • రూ.30 వేల కోట్ల విలువైన ఈ భూమికి హైడ్రా రక్షణ
  • చారిత్రక రాతి నిర్మాణాలను కాపాడేందుకు చర్యలు
  • ఎన్జీవో ఫిర్యాదు, కోర్టు ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
  • కబ్జాల నివారణకు హైడ్రా ప్రత్యేక డ్రైవ్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైడ్రా ఒక భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా వివాదాల్లో నలుగుతూ, కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకునే ప్రమాదంలో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని రక్షించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ-ఖాజాగూడ సరిహద్దుల్లో ఉన్న 198 ఎకరాల ప్రభుత్వ భూమిని శుక్రవారం హైడ్రా తన ఆధీనంలోకి తీసుకుంది. సుమారు రూ.30,000 కోట్ల విలువ చేసే ఈ భూమిలో 250 కోట్ల సంవత్సరాల నాటి అరుదైన చారిత్రక రాతి గుట్టలు కూడా ఉండటం విశేషం. ఈ ఆపరేషన్‌తో అమూల్యమైన ప్రకృతి, చారిత్రక సంపదకు హైడ్రా రక్షణ కవచం ఏర్పాటు చేసింది.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు కేటాయించిన ఈ భూమిలో అద్భుతమైన రాతి శిలలు, గుహలు, పచ్చని చెట్లు ఉన్నాయి. ఈ చారిత్రక సంపదను కాపాడాలంటూ 'సొసైటీ టు సేవ్ రాక్స్' ప్రతినిధులు దశాబ్దాలుగా న్యాయపోరాటం చేస్తున్నారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, 2019లోనే ఈ రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని సంరక్షించాలని మున్సిపల్, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. అయితే, హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయడంలో జాప్యం జరగడంతో భూమి కబ్జాకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. దీంతో 'సొసైటీ టు సేవ్ రాక్స్' ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో పర్యటించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి సంయుక్తంగా సర్వే నిర్వహించి, భూమిని ప్రభుత్వ ఆస్తిగా నిర్ధారించుకున్నారు. అనంతరం శుక్రవారం పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. 

రెవెన్యూ రికార్డుల ప్రకారం.. సర్వే నంబర్ 452/1లో 174 ఎకరాలు, 454/1లో 119.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఓవర్‌ల్యాప్ సమస్యల కారణంగా 63.05 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా గుర్తించి, మిగిలిన భూమిలో దేవాలయాలకు 5 ఎకరాలు, దర్గాకు 5 ఎకరాలు కేటాయించగా, నికరంగా 200 ఎకరాల హెచ్‌ఎండీఏ భూమిని హైడ్రా కాపాడింది.

ఈ ఆపరేషన్‌పై 'సొసైటీ టు సేవ్ రాక్స్' ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సహజ సిద్ధమైన వ్యూ పాయింట్లు, చారిత్రక గుట్టలను కాపాడి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసినందుకు హైడ్రాను అభినందించారు. స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు సైతం ప్రభుత్వ చొరవను కొనియాడారు. ఇదే సమయంలో, ఈ గుట్టలను ఆనుకుని ఉన్న భగీరథమ్మ చెరువును కూడా హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు జలకళతో నిండిన చెరువుతో ఈ ప్రాంతం భవిష్యత్తులో ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.



HYDRAA
AV Ranganath
Khajaguda Hills
Puppalguda Land Reclaim
Hyderabad Real Estate
Society to Save Rocks
HMDA Government Land
Rangareddy District News
Bhagirathamma Cheruvu Restoration
Telangana Land Protection

More Telugu News