పండు మాస్టర్కు అండగా ఎమ్మెల్యే పల్లా.. వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ
- రోడ్డు ప్రమాదంలో గాయపడిన కొరియోగ్రాఫర్ పండు మాస్టర్
- వైద్య ఖర్చులన్నీ భరిస్తానని ముందుకొచ్చిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
- పండు మాస్టర్కు సర్జరీ పూర్తి, ప్రాణాపాయం లేదన్న వైద్యులు
- పూర్తిగా కోలుకునేందుకు ఆరు నెలల విశ్రాంతి అవసరమని వెల్లడి
- ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
ప్రమాద విషయం తెలియగానే పల్లా శ్రీనివాసరావు వెంటనే స్పందించారు. పండు మాస్టర్ సన్నిహితులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు అయ్యే ఖర్చుల గురించి ఎంతమాత్రం ఆందోళన చెందవద్దని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం డాక్టర్లతో తాను స్వయంగా మాట్లాడతానని భరోసా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోన్ సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే మంచి మనసుపై నెటిజన్లు, పండు మాస్టర్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆరోగ్యం నిలకడగా ఉంది: వైద్యులు
ప్రస్తుతం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ప్రమాదంలో ఆయన నడుము కింది భాగంలో జాయింట్ డిస్లొకేషన్ కాగా, శస్త్రచికిత్స ద్వారా దాన్ని సరిచేసినట్లు వెల్లడించారు. అయితే, ఆయన రెండు కాళ్లకు కూడా సర్జరీలు చేయాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. శస్త్రచికిత్సల అనంతరం పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల విశ్రాంతి అవసరమని, ఆ తర్వాత ఆయన మళ్లీ యధావిధిగా డ్యాన్స్ చేయవచ్చని వైద్య బృందం స్పష్టం చేసింది. ఈ వార్తతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు కాస్త ఊరట చెందారు.
మరోవైపు ఈ ప్రమాదానికి కోళ్ల వ్యాన్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పండు మాస్టర్ త్వరగా కోలుకోవాలని సినీ, బుల్లితెర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.