భారత్కు షాకిచ్చిన అమెరికా.. ట్రేడ్ చర్చల వేళ 12.5 శాతం అదనపు పన్నుల ప్రతిపాదన!
- భారత్-అమెరికా వాణిజ్య చర్చల వేళ యూఎస్టిఆర్ వివాదాస్పద నిర్ణయం
- సెక్షన్ 301 దర్యాప్తులో భారత్లో 'అన్యాయమైన వాణిజ్య పద్ధతులు' ఉన్నట్లు గుర్తింపు
- బలవంతపు శ్రమతో కూడిన వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో విఫలమైనట్లు ఆరోపణ
- న్యూఢిల్లీలో ఇరు దేశాల కీలక చర్చలు జరుగుతున్న రోజే ఈ ప్రకటన
అమెరికా ట్రేడ్ యాక్ట్ 1974 లోని 'సెక్షన్ 301' కింద నిర్వహించిన 60 సుదీర్ఘ దర్యాప్తుల ఫలితాలను యూఎస్టిఆర్ అధికారికంగా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 54 ఆర్థిక వ్యవస్థలలో 'బలవంతపు శ్రమ' (Forced Labour) ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను సమర్థవంతంగా నిషేధించడానికి లేదా నిరోధించడానికి తగినంత కఠినమైన చర్యలు లేవని అమెరికా తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ 54 దేశాల జాబితాలోనే భారతదేశాన్ని కూడా చేర్చడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జామీసన్ గ్రీర్ (Jamieson Greer) ఈ విషయమై మాట్లాడుతూ.. "మా అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతుల సమస్యను పరిష్కరించడంలో విఫలం కావడం అంగీకరించలేనిది. దీనివల్ల అమెరికా కార్మికులు ప్రపంచవ్యాప్తంగా అసమానమైన, అన్యాయమైన వాతావరణంలో పోటీ పడాల్సి వస్తోంది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరికి ఎంత పన్ను?
యూఎస్టిఆర్ నోటిఫికేషన్ ప్రకారం.. బలవంతపు శ్రమకు సంబంధించిన దిగుమతులపై ఇప్పటికే పాక్షిక ఆంక్షలు విధించిన లేదా పరస్పర వాణిజ్య ఒప్పందాల ద్వారా ఆ నిబంధనలను అమలు చేయడానికి అంగీకరించిన దేశాలపై 10 శాతం అదనపు టారిఫ్ పడుతుంది. అయితే, ఈ ప్రమాణాలను అస్సలు పాటించని భారతదేశం, చైనా, జపాన్, సౌత్ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల దిగుమతులపై గరిష్టంగా 12.5 శాతం అదనపు సుంకం విధించనున్నారు. టెక్స్టైల్స్, దుస్తుల దిగుమతుల కోసం మాత్రం అమెరికా కొంత తక్కువ పన్నుతో ప్రత్యేక కోటాను ప్రతిపాదించింది.
ఈ పరిణామం భారత్కు అత్యంత కీలకమైన సమయంలో ఎదురైంది. సరిగ్గా న్యూఢిల్లీలో ఇరు దేశాల సీనియర్ వాణిజ్య అధికారులు మూడు రోజుల పాటు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ముమ్మర చర్చల్లో మునిగిపోయిన రోజే అమెరికా ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ ప్రతిపాదిత సుంకాలపై జులై మొదటి వారం వరకు ప్రజాభిప్రాయ సేకరణ (Public Comments), సమీక్షలు జరగనున్నాయి, ఆ తర్వాతే ఇవి అధికారికంగా అమలులోకి వస్తాయి. ఒకవేళ ఈ అదనపు పన్నులు అమలైతే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరిగి భారతీయ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.