'నాకు ఊపిరి ఆడటం లేదు'.. చనిపోతున్న యువకుడి మాటలు పెడచెవిన పెట్టిన పోలీసులు

  • యూకేలో టీనేజర్‌ను కత్తితో పొడిచి చంపిన భారత సంతతి వ్యక్తి
  • తానే బాధితుడినంటూ పోలీసులను తప్పుదోవ పట్టించిన హంతకుడు
  • ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితుడికి బేడీలు వేసిన పోలీసులు
  • వైరల్ అయిన బాడీక్యామ్ వీడియో.. బ్రిటన్‌లో తీవ్ర నిరసనలు
  • హంతకుడికి జీవిత ఖైదు.. పోలీసుల తీరుపై స్వతంత్ర విచారణ
బ్రిటన్‌ను ప్రస్తుతం ఓ దారుణ ఘటన తీవ్రంగా కుదిపేస్తోంది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ టీనేజర్‌కు సహాయం చేయాల్సింది పోయి, పోలీసులు అతడికే బేడీలు వేసిన అమానవీయ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారత సంతతికి చెందిన ఓ సిక్కు యువకుడు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన 18 ఏళ్ల హెన్రీ నోవాక్, పోలీసుల ముందే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసు బాడీక్యామ్ ఫుటేజ్ బయటకు రావడంతో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.

అస‌లేం జరిగింది?
దక్షిణ ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ నగరంలో ఈ విషాదం చోటుచేసుకుంది. 23 ఏళ్ల విక్రమ్ దిగ్వా అనే సిక్కు యువకుడు, హెన్రీ నోవాక్‌ను కత్తితో దారుణంగా పొడిచాడు. అయితే, పోలీసులకు ఫోన్ చేసి తనపై జాతి వివక్ష దాడి జరిగిందని, హెన్రీ తనను కొట్టాడని నాటకమాడాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దిగ్వా చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేశారు. రక్తపు మడుగులో పడివున్న హెన్రీ, "నన్ను కత్తితో పొడిచారు. నాకు ఊపిరి ఆడటం లేదు" అని పదేపదే వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదు. పైగా "నిన్ను పొడిచారని మేము అనుకోవడం లేదు" అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి, చనిపోతున్న హెన్రీకి బేడీలు వేశారు.

ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు, దిగ్వా జాతి వివక్ష నాటకాన్ని బట్టబయలు చేసింది. అతడు చెప్పినవన్నీ అబద్ధాలని తేల్చి, హత్య చేసినందుకు జీవిత ఖైదు (కనీసం 21 ఏళ్లు) విధించింది. హంతకుడికి సహకరించిన అతడి తల్లి కిరణ్ కౌర్‌ను కూడా దోషిగా నిర్ధారించారు.

తీవ్ర నిరసనలు.. రాజకీయ దుమారం
పోలీసుల బాడీక్యామ్ వీడియో వైరల్ కావడంతో, బ్రిటన్‌లో తీవ్ర నిరసనలు చెలరేగాయి. సౌతాంప్టన్‌లోని పోలీస్ స్టేషన్ వెలుపల వందలాది మంది 'నాకు ఊపిరి ఆడటం లేదు' అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. ప్రధాని కీర్ స్టార్మర్ ఈ వీడియో చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాతి వివక్ష ఆరోపణలు పోలీసుల నిర్ణయాలను ఎలా ప్రభావితం చేశాయో తేలాలని అన్నారు. మరోవైపు, సంస్కరణల పార్టీ నేత నిగెల్ ఫరాజ్ దీన్ని 'టూ-టైర్ పోలీసింగ్' (ద్వంద్వ ప్రమాణాలు) అంటూ విమర్శించారు. శ్వేతజాతీయుల కంటే మైనారిటీల పట్ల పోలీసులు మెరుగ్గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

అయితే, హోం సెక్రటరీ షబానా మహమూద్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని సమాజంలో చిచ్చు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. పోలీసుల తీరుపై స్వతంత్ర దర్యాప్తు జరుగుతోందని, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.

హంతకుడు వాడింది కిర్పాన్ కాదు
యూకేలో కఠినమైన ఆయుధ చట్టాలున్నాయి. మతపరమైన కారణాలతో సిక్కులు 'కిర్పాన్' అనే చిన్న కత్తిని ధరించడానికి అనుమతి ఉంది. అయితే, దిగ్వా హత్యకు ఉపయోగించింది కిర్పాన్ కాదని, 8 అంగుళాల పొడవున్న పెద్ద కత్తి అని కోర్టు గుర్తించింది. దిగ్వా చర్యల వల్ల అమాయక సిక్కుల భద్రతకు ముప్పు వాటిల్లిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

దిగ్వా చెప్పిన అబద్ధాల వల్ల తాము తప్పుదోవ పట్టామని పోలీసులు అంగీకరించి, హెన్రీ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. తన కుమారుడి మరణం సమాజంలో విద్వేషాలకు దారితీయకూడదని, సురక్షితమైన వీధుల కోసం ఇది ఒక మేల్కొలుపు కావాలని హెన్రీ తండ్రి మార్క్ నోవాక్ ఆవేదన వ్యక్తం చేశారు.

Indian
Vickrum Digwa
Henry Nowak
UK Cops
Britain

More Telugu News