తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ, అమిత్ షా!

  • నేడు తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం
  • పోరాట పటిమకు తెలంగాణ ప్రతీక అన్న మోదీ
  • దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్న అమిత్ షా

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు తెలుగులో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ తన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో నేతలిద్దరూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం సాహసం, సంకల్పం, పోరాట పటిమకు ఒక శక్తిమంతమైన ప్రతీక అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడి ప్రజల సృజనాత్మకత, వ్యాపార నైపుణ్యాలు అద్భుతమైనవని, వికసిత భారత్ కలని సాకారం చేయడంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని స్పష్టం చేస్తూ, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.


అమిత్ షా సైతం తెలుగులోనే తన సందేశాన్ని పంచుకుంటూ తెలంగాణ విశిష్ట సంస్కృతిని, పారిశ్రామిక నైపుణ్యాన్ని అభినందించారు. దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశ కీర్తిని మరింత పెంచుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంటూ ఆయన తన సందేశాన్ని ‘జై తెలంగాణ’తో ముగించారు. దేశంలోని ఇద్దరు అగ్రనేతలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఇక్కడి ప్రజలకు గౌరవపూర్వకంగా మాతృభాషలోనే శుభాకాంక్షలు తెలపడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.


Narendra Modi
Amit Shah
BJP
Telangana Formation Day

More Telugu News