ఏలూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు వృద్ధ మహిళల సజీవ దహనం

  • ఏలూరు జిల్లా వేలేరుపాడు గ్రామంలో ఘటన
  • ఇంట్లో నిద్రిస్తుండగా ఇద్దరు వృద్ధ మహిళలు సజీవ దహనం
  •  మృతుల్లో ఒకరు తెలంగాణ నుంచి వచ్చిన బంధువు
  •  పూర్తిగా కాలి బూడిదైన ఇల్లు, పక్క ఇంటికీ వ్యాపించిన మంటలు
ఏలూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వేలేరుపాడు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో మంటలు చెలరేగి ఇద్దరు వృద్ధ మహిళలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

స్థానికుల కథనం ప్రకారం, వలగని సావిత్రి (60), పూలమ్మ (65) అనే ఇద్దరు మహిళలు ప్రమాద సమయంలో ఇంట్లో నిద్రిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు బయటకు రాలేకపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరైన పూలమ్మ తెలంగాణలోని సూర్యాపేట నివాసి. ఆమె తన సోదరి సావిత్రి ఇంటికి చుట్టపు చూపుగా వచ్చారు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలి బూడిదైంది. మంటల తీవ్రతకు పక్కనే ఉన్న మరో ఇంటికి కూడా నష్టం వాటిల్లింది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

West Godavari
Fire Accident
Eluru
womens
burnt alive
Andhra Pradesh

More Telugu News