పాలనలో ఆ రెండు చాలా ముఖ్యం: కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు

  • 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం
  • పాలనలో టెక్నాలజీ, మానవీయత రెండూ ముఖ్యమన్న సీఎం చంద్రబాబు
  • ప్రతీ శుక్రవారం నియోజకవర్గాల్లో 'ఫీల్డ్ గ్రీవెన్స్ డే' నిర్వహణ
  • ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
  • అర్జీల పరిష్కారంలో ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోవాలని సూచన
  • 90 రోజుల్లో అన్ని శాఖల కేపీఐలతో డ్యాష్ బోర్డు ఏర్పాటుకు సన్నాహాలు
"పాలనలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో, అదే సమయంలో మానవీయ కోణంతో ఆలోచించి ప్రజలకు సేవలు అందించడం కూడా అంతే ముఖ్యం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం సాంకేతికతపైనే ఆధారపడి యాంత్రికంగా కాకుండా, ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వారి పట్ల కరుణతో స్పందించాలని అధికారులకు ఆయన హితవు పలికారు. 

శుక్రవారం జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రెండో రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పాలనా వ్యవస్థలో వేగం, పారదర్శకతతో పాటు మానవతా విలువలకు పెద్దపీట వేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఫైళ్ల క్లియరెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం (పీజీఆర్ఎస్), టెక్నాలజీ వినియోగం వంటి పలు కీలక అంశాలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు.

అర్జీల పరిష్కారంలో బ్రాండ్ ఇమేజ్ రావాలి
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో రాష్ట్రం ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సంపాదించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొందరు అధికారులు అర్జీలను తీసుకుని కార్లలో పడేస్తున్నారనే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని, ఇలాంటి అలసత్వం పునరావృతం కావొద్దని గట్టిగా హెచ్చరించారు. "ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి. కాగితాలు తీసుకుని పక్కన పడేయడం కాదు, సమస్య పరిష్కారమైతేనే ప్రజల్లో ప్రభుత్వపై విశ్వాసం పెరుగుతుంది" అని అన్నారు. ఇందుకు అనుగుణంగా 'ప్రజా దర్బార్' వంటి ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 

సింగపూర్ తరహాలో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి కూర్చుని అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. దీనిలో భాగంగా, ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే మాదిరిగానే, ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో 'ఫీల్డ్ గ్రీవెన్స్ డే' నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్లు 'గుడ్ విల్ మిషన్' గా క్షేత్రస్థాయికి వెళ్లి, ప్రతి నెలా ఒక నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఫైళ్ల క్లియరెన్స్‌లో సత్వర స్పందన
ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా అందాలంటే ఫైళ్ల క్లియరెన్స్ అత్యంత కీలకమని చంద్రబాబు పేర్కొన్నారు. గత మూడు నెలలతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఫైళ్ల క్లియరెన్స్ సగటు సమయం 10 రోజుల నుంచి 2 రోజులకు తగ్గడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దమొత్తంలో ఫైళ్లు వచ్చినా, సగటున 10 గంటల వ్యవధిలోనే డిస్పోజ్ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తిని మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు, ఎస్పీలు కొనసాగించాలని, 24 గంటల్లోపు ఇ-ఫైల్స్ పరిష్కరించేలా శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. 

పనితీరులో వెనుకబడిన అధికారులు వేగం పెంచుకోవాలని స్పష్టం చేశారు. ఇకపై మాన్యువల్ ఫైళ్లకు స్వస్తి పలికి, జిల్లా స్థాయి నుంచి హెచ్ఓడీల వరకు తప్పనిసరిగా ఇ-ఫైల్స్ మాత్రమే జనరేట్ చేయాలని ఆదేశించారు.

ఆన్‌లైన్ సేవలతో అవినీతికి చెక్
ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సమయం ఆదా అవ్వడంతో పాటు, అవినీతికి కూడా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. 'వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర' ద్వారా ఇప్పటికే 29 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, డిసెంబరు నాటికి 100 శాతం ప్రభుత్వ సేవలను వాట్సాప్‌లో అందించేలా చూడాలని లక్ష్యం నిర్దేశించారు. 

స్మార్ట్ ఫోన్లు లేని 34 శాతం కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని, మాన్యువల్ టచ్ పాయింట్ల వద్ద వారికి వాట్సాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. తుపాను, పిడుగుల వంటి ప్రకృతి వైపరీత్యాల హెచ్చరికలను నేరుగా ప్రజల మొబైళ్లకే పంపే వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు.

ఈ సమీక్షలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖల పనితీరును, రోజువారీ లక్ష్యాలను ఒకే వేదికపై పర్యవేక్షించేందుకు వీలుగా ఒక సమగ్ర డ్యాష్‌బోర్డును రూపొందిస్తున్నామని తెలిపారు. రాబోయే 90 రోజుల్లో ఈ డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తెస్తామని సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.



Chandrababu Naidu
Andhra Pradesh
Collector Conference
Public Grievances
E-Governance
File Clearance
Technology in Governance
Nara Lokesh
Sai Prasad
WhatsApp Governance

More Telugu News