విజయ్ను రాజకీయ అభిమన్యుడిని చేసే ప్రయత్నం జరుగుతోంది: పోసాని ఆవేదన
- ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు అవకాశం కల్పించకపోవడంపై పోసాని ఆగ్రహం
- విజయ్ చుట్టూ రాజకీయ కుట్ర జరుగుతోందని మండిపాటు
- విజయ్ అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని వ్యాఖ్య
తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత విజయ్కు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇవ్వకపోవడంపై సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. విజయ్ చుట్టూ రాజకీయ కుట్ర జరుగుతోందని, ఆయనను 'రాజకీయ అభిమన్యుడిని' చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా, మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ కోరడం పక్షపాతంతో కూడిన నిర్ణయం అని పోసాని అభిప్రాయపడ్డారు. ఇది విజయ్ను అడ్డుకోవడానికి జరుగుతున్న ప్లాన్లో భాగమేనని ఆయన ఆరోపించారు. విజయ్ తనకు 1996 నుంచి తెలుసని, ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్తో కూడా తనకు పరిచయం ఉందని పోసాని గుర్తు చేసుకున్నారు. విజయ్ ఎప్పుడూ అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని, ఎన్ని గొడవలు ఎదురైనా ఎంతో సంయమనంతో వ్యవహరిస్తారని కొనియాడారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ను ఒంటరిని చేసేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని, ఆయనకు దక్కాల్సిన అవకాశాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మండిపడ్డారు.