ఈసీ సంచలన నిర్ణయం.. పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా నియోజకవర్గంలో ఎన్నిక రద్దు!

  • తీవ్రమైన అవకతవకల కారణంగా ఈసీ నిర్ణయం
  • నియోజకవర్గం మొత్తం మే 21న మళ్లీ పోలింగ్
  • ఫల్టా ఓట్ల లెక్కింపు మే 24కు వాయిదా
  • మిగతా 293 స్థానాల్లో రేపు యథాతథంగా కౌంటింగ్
పశ్చిమ బెంగాల్‌ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్‌ను ఎన్నికల సంఘం పూర్తిగా రద్దు చేసింది. పోలింగ్ సందర్భంగా తీవ్రమైన అవకతవకలు జరగడంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిందని నిర్ధారించుకున్న ఈసీ ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేసింది.

నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో మే 21న తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. మే 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మే 24న ఓట్ల లెక్కింపు చేపడతారు. అయితే, పశ్చిమ బెంగాల్‌లోని మిగతా 293 అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్ ప్రకారం రేపు ఓట్ల లెక్కింపు యథావిధిగా కొనసాగుతుంది.

పోలింగ్ రోజున ఫల్టాలో ఈవీఎంల ట్యాంపరింగ్, అనేక బూత్‌లలో నిఘా కెమెరాలను స్విచ్ ఆఫ్ చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని బూత్‌లలో ఈవీఎంలకు టేపులు చుట్టడం, మధ్యాహ్నం ఒంటి గంటకు వాటిని తొలగించే సమయానికే 58 శాతం పోలింగ్ నమోదు కావడం ఎన్నికల పారదర్శకతపై సందేహాలకు దారితీసింది. దీనిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ప్రత్యేక పరిశీలకుడు సుబ్రతా గుప్తా, క్షేత్రస్థాయిలో పర్యటించి ఈసీకి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగానే ఎన్నికల సంఘం నియోజకవర్గం మొత్తం పోలింగ్‌ను రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. 

Falata Constituency
West Bengal Elections
Election Commission of India
Falata Election Cancelled
South 24 Parganas
Re-polling
EVM Tampering
Subrata Gupta
Bengal Assembly Elections

More Telugu News