నిప్పుల కొలిమిలా ఏపీ... పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత

  • రాష్ట్రంలో ఈ వేసవిలో ఇప్పటిదాకా ఇదే అత్యధిక ఉష్ణోగ్రత 
  • శనివారం 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక
  • ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన
  • ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ సూచన
ఆంధ్రప్రదేశ్‌లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో శుక్రవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ ఏకంగా 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలో ఈ వేసవి సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని అధికారులు స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్రంలోని 21 జిల్లాల పరిధిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 252 మండలాల్లో 41 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు, రానున్న రెండు రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా పల్నాడులో 19, పార్వతీపురం మన్యంలో 10, ప్రకాశంలో 10 మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల్లోని 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.

ఇదిలా ఉండగా, ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గి, ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ సూచించింది.

Andhra Pradesh Heatwave
AP Heatwave
Prakhar Jain
APS DMA
Heatwave alert
Palanadu
Record Temperature
Summer 2024
India heatwave
Weather forecast

More Telugu News