చమురు మంటలు: లాభాల్లో ముగిసినా... గరిష్ఠాల నుంచి వెనక్కి తగ్గిన మార్కెట్లు

  • అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలతో ఇన్వెస్టర్లలో ఆందోళన
  • సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 181 పాయింట్లు వృద్ధి
  • మిశ్రమంగా స్పందించిన బ్రాడర్ మార్కెట్లు, రంగాల సూచీలు
  • కీలక షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో నష్టాలు పరిమితం
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. అయితే, రోజంతా కొనసాగిన ఉత్సాహం చివరి గంటలో ఆవిరైంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఇంట్రాడే గరిష్ఠాల నుంచి సూచీలు వెనక్కి తగ్గాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 609.45 పాయింట్ల లాభంతో 77,496.36 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 181.95 పాయింట్లు పెరిగి 24,177.65 వద్ద ముగిసింది.

అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు నిలిచిపోవడం, మే 1 నుంచి ఒపెక్ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించడంతో సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. దీంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 3 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు 114.60 డాలర్లకు చేరింది. ఈ పరిణామం మార్కెట్ల జోరుకు బ్రేకులు వేసింది.

టెక్నికల్ గా చూస్తే, నిఫ్టీకి 24,200 వద్ద కీలక నిరోధకం ఉందని, ఒకవేళ సూచీ కిందకు వస్తే 24,000-24,100 స్థాయి మద్దతుగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

సూచీలు చివరి గంటలో వెనక్కి తగ్గినప్పటికీ ఐటీసీ, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ వంటి హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు లాభాల్లో ముగియగలిగాయి. బ్రాడర్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ స్వల్పంగా నష్టపోగా, స్మాల్‌క్యాప్ సూచీ 0.65 శాతం లాభపడింది.

రంగాల వారీగా చూస్తే ఎఫ్ఎంసీజీ, రియల్టీ షేర్లు రాణించగా, కన్‌స్ట్రక్షన్ డ్యూరబుల్, మీడియా రంగాల సూచీలు నష్టపోయాయి. పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా ఫెడ్ పాలసీ నిర్ణయం వంటి అంశాలు సమీప భవిష్యత్తులో మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Stock Market
Profts
Crude Oil Crisis
Sensex
Nifty
West Asia Conflict
India

More Telugu News