రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ: కేటీఆర్

  • రేవంత్ రెడ్డి తాను మారిన మనిషినని చెబుతున్నారన్న కేటీఆర్
  • ఎన్నికల తర్వాత కుంభకర్ణుడయ్యాడు కాబట్టి ఆయన చెప్పింది నిజమేనని చురక
  • ఈ దుర్మార్గపు పాలనను మరొక్క సంవత్సరం తట్టుకోవాలన్న కేటీఆర్
తాను మారిన మనిషినని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఆయన చెప్పినదాంట్లో నిజం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు ముందు ఆయన దానవీరశూరకర్ణ అయితే, ఎన్నికల తర్వాత కుంభకర్ణుడు అయ్యాడని ఎద్దేవా చేశారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీలకు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఆయన పాలమూరు బిడ్డ, ఇప్పుడు కనీసం పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ అని ఎద్దేవా చేశారు. నాగర్ కర్నూలు, పాలమూరులలోనే రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే సిగ్గనిపించడం లేదా అని మండిపడ్డారు. విద్యుత్ ఇవ్వడం లేదని, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నారని, రైతు బంధు ఖాతాల్లో పడటం లేదని, వీటికి ఆయనకు సిగ్గనిపించడం లేదా అని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ నాయకులు తిడుతుంటే తనకు పైశాచిక ఆనందం వస్తుందని రేవంత్ రెడ్డి చెబుతుంటే విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తమ గ్రామాలు, మండలాల్లో ఉండే సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. మరో సంవత్సరం తర్వాత రేవంత్ రెడ్డి చెబితే, కూర్చున్న కుక్క కూడా లేవదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దుర్మార్గపు, అరాచకపు పాలనను మరొక్క సంవత్సరం తట్టుకుంటే, చివరి ఏడాది అంతా ఎన్నికల హడావుడి ఉంటుందని అన్నారు.

KTR lashes out at Revanth Reddy
KTR on Revanth Reddy

More Telugu News