'విశాఖలో గూగుల్‌'పై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఎకరా 99 పైసలకు ఓకే.. కానీ!

  • విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతించిన విజయసాయిరెడ్డి
  • ఉద్యోగాల కల్పనపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలని ప్రభుత్వానికి సూచన
  • రాజకీయ ప్రసంగాల కన్నా ఉపాధి హామీపై మాట్లాడితే బాగుండేదని హితవు
  • 99 పైసలకే భూములు ఇచ్చినా, భారీగా ఉపాధి కల్పిస్తేనే ప్రయోజనం అని వ్యాఖ్య
ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతిస్తూనే, ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపులకు బదులుగా రాష్ట్ర యువతకు శాశ్వత ఉపాధి లభించేలా స్పష్టమైన హామీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ చేసిన ప్రసంగంపై విజయసాయిరెడ్డి స్పందించారు. ఇలాంటి వేదికలపై రాజకీయ ప్రసంగాలు చేయడం కన్నా, గూగుల్ ద్వారా రాష్ట్ర యువతకు ఎంతకాలంలో, ఏయే విభాగాల్లో, ఎన్ని ఉద్యోగాలు వస్తాయో స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించి ఉంటే బాగుండేదని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఐటీ రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు (లే ఆఫ్స్) ఉన్నాయని గుర్తుచేస్తూ, ఇలాంటి తరుణంలో ఉపాధిపై ప్రభుత్వ భరోసా ఎంతో కీలకమని పేర్కొన్నారు.

ఐటీ కంపెనీలకు ప్రభుత్వం ఎకరా 99 పైసలకే భూములు కేటాయించడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రజలకు నిరంతరం, భారీ స్థాయిలో ఉపాధిని కల్పించేలా ఉండాలని షరతు పెట్టారు. అప్పుడే అది ప్రజా ప్రయోజనాల కోసం జరిగిన ఒప్పందంగా పరిగణించవచ్చని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు పలు కంపెనీలకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌కు ఇప్పటికే శంకుస్థాపనలు జరిగాయి. ఈ క్రమంలోనే పలు ఐటీ కంపెనీలకు విశాఖలో ఎకరా భూమిని కేవలం 99 పైసలకే కేటాయించారు.

ఇటీవల వైసీపీకి, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి రాజకీయాలకు విరామం ప్రకటించారు. అయితే, త్వరలోనే మళ్లీ రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తానని ప్రకటించిన ఆయన, ప్రస్తుతం ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ చురుగ్గా ఉంటున్నారు.

Vijaya Sai Reddy
Google AI Data Center
Vizag
Nara Lokesh
Chandrababu
Andhra Pradesh

More Telugu News