యాక్సిస్ బ్యాంకులో 3,000 మంది ఉద్యోగులు ఎందుకు తగ్గారు?

  • టెక్నాలజీ వినియోగంతో యాక్సిస్ బ్యాంకులో తగ్గిన ఉద్యోగులు
  • కొత్తగా 400 బ్రాంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపిన బ్యాంకు
  • ప్రస్తుతానికి ఏఐతో ఉద్యోగాల కోత లేదని స్పష్టం చేసిన సీఈవో
  • రూపాయి డివిడెండ్ ప్రకటించిన యాక్సిస్ బ్యాంక్
ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. టెక్నాలజీపై పెట్టిన పెట్టుబడుల వల్ల కార్యకలాపాల్లో సామర్థ్యం పెరగడమే దీనికి కారణమని బ్యాంకు స్పష్టం చేసింది. డిజిటల్ సేవల వైపు దృష్టి సారించడం వల్ల సహజంగానే ఉద్యోగుల సంఖ్యలో ఈ మార్పు కనిపించిందని బ్యాంకు ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరి విశ్లేషకులకు తెలిపారు.

2026 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి బ్యాంకులో ఉద్యోగుల సంఖ్య 1.01 లక్షలకు చేరింది. గతేడాది ఇదే సమయానికి ఇది 1.04 లక్షలుగా ఉండేది. అంటే, ఈ ఏడాదిలో సుమారు 3,000 మంది సిబ్బంది తగ్గారు. అయితే ఇది ఏ ఒక్క విభాగానికో పరిమితం కాలేదని, అన్ని విభాగాల్లోనూ ఈ మార్పు కనిపించిందని బ్యాంకు పేర్కొంది.

ఉద్యోగుల సంఖ్య తగ్గినా, మరోవైపు బ్యాంకు తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 400 బ్రాంచీలను ప్రారంభించినట్లు యాజమాన్యం వెల్లడించింది. గత మూడు, నాలుగేళ్లుగా తమ నిర్వహణ వ్యయంలో 9-10 శాతం నిధులను టెక్నాలజీ కోసం కేటాయిస్తున్నామని అమితాబ్ చౌదరి తెలిపారు.

అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ఉద్యోగుల అవసరం ఇంకా తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏఐని కేవలం ప్రక్రియలను సులభతరం చేయడానికి, లావాదేవీల సమయాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నామని వివరించారు.

ఇక ఆర్థిక ఫలితాల విషయానికొస్తే, మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ.7,071 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.1 డివిడెండ్ ప్రకటించింది.

Axis Bank
Axis Bank employees
Amitabh Chaudhry
Indian banking sector
banking jobs India
bank digital services
AI impact jobs
bank financial results
bank expansion
bank technology investments

More Telugu News