మెదక్ హైవేపై కాలిబూడిదైన ప్రైవేట్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

  • సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్, క్లీనర్
  • రిపేర్ చేయించి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన
  • షార్ట్ సర్క్యూట్‌పై పోలీసుల అనుమానం, దర్యాప్తు
మెదక్ జిల్లాలో జాతీయ రహదారి 44పై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం, డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించి బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది.

పోలీసుల వివరాల ప్రకారం, ఈ బస్సులో సాంకేతిక సమస్య తలెత్తడంతో మరమ్మతుల కోసం హైదరాబాద్ నుంచి మెదక్‌కు తీసుకొచ్చారు. రిపేర్ పూర్తయ్యాక సోమవారం తెల్లవారుజామున డ్రైవర్, క్లీనర్‌తో కలిసి హైదరాబాద్‌కు తిరుగు పయనమైంది. మాసాయిపేట సమీపించగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని డ్రైవర్ గమనించారు. వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, క్లీనర్‌, డ్రైవర్ ఇద్దరూ కిందకు దూకేసి, సురక్షితంగా బయటపడ్డారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మరమ్మతుల సమయంలో జరిగిన లోపమా? లేక షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
 

Medak Bus Fire
Medak
Bus Accident
National Highway 44
Fire Accident
Telangana
Private Bus
Masaipet
Hyderabad

More Telugu News