మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాలపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఫైర్
- మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలన్నది ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమన్న శ్రీనివాస వర్మ
- డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారం చేశాయని మండిపాటు
- కొన్ని పార్టీలు తమ కుటుంబ సభ్యులకే పదవులు ఇస్తున్నాయని విమర్శ
ఎన్డీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లను 2029 సాధారణ ఎన్నికల నుంచే అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. అందుకోసం పార్లమెంట్కు తీసుకొచ్చిన సవరణ బిల్లు విపక్షాల వ్యతిరేకతతో వీగిపోవడంపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు తీవ్రంగా స్పందించారు. మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేయడానికి వీలుగా లోక్సభ స్థానాలను 850కి పెంచేందుకు ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు. అయితే, దీనికి కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ లభించలేదని, కేవలం 84 ఓట్ల తేడాతో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బిల్లును ఓడించాయని ఆయన మండిపడ్డారు.
నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. లోక్సభ స్థానాల సంఖ్య పెరగడం వల్ల అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతుందే తప్ప ఎవరికీ నష్టం ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా హామీ ఇచ్చినా విపక్షాలు పట్టించుకోలేదని మండిపడ్డారు.
కొన్ని పార్టీలు కేవలం తమ కుటుంబ సభ్యులకే పదవులు ఇస్తూ, సాధారణ మహిళలకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నాయని, కానీ బీజేపీ 25 ఏళ్లుగా పార్టీలో 33 శాతం పదవులను మహిళలకు ఇస్తూ వస్తోందని గుర్తు చేశారు. బిల్లు తాత్కాలికంగా ఆగిపోయినా, ప్రధాని మోదీ నాయకత్వంలో 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు అయ్యేలా చూస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.