మోదీకి పేరు వస్తుందనే మహిళా బిల్లును అడ్డుకున్నారు: డీకే అరుణ
- మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై తీవ్రంగా స్పందించిన డీకే అరుణ
- మహిళలు చట్టసభల్లోకి రావడం విపక్షాలకు ఇష్టం లేదని ఆరోపణ
- డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనేది అపోహ మాత్రమేనని వ్యాఖ్య
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాల తీరును ఆమె ఎండగట్టారు. మహిళలు చట్టసభల్లోకి రావడం ఇష్టం లేకే విపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరించాయని ఆమె ఆరోపించారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ హుందాగా వ్యవహరించలేదని, మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే ప్రధాని మోదీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న భయంతోనే కాంగ్రెస్ దీనిని అడ్డుకుందని ఆమె మండిపడ్డారు.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని డీకే అరుణ అన్నారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విడగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీడీపీ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయాలంటున్న సీఎం రేవంత్ రెడ్డి... ఆ సాకుతో హైదరాబాద్లోనే ఎక్కువ సీట్లు పెంచుకోవాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈనెల 24న గవర్నర్ శివప్రతాప్ శుక్లా మహబూబ్ నగర్లో పర్యటించనున్నారని, 'ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్' విజేతలకు ఆయన బహుమతులు అందజేస్తారని వెల్లడించారు.