కూటమి నేతల ప్రకటనలు సముచితంగా లేవు: చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం లేఖ

Ponnam Prabhakar letter to Chandrababu Naidu
  • రాష్ట్ర విభజనపై కూటమి నేతల వ్యాఖ్యలు సరిగా లేవన్న పొన్నం
  • ఇలాంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలను రగిలించే ప్రమాదం ఉందని హెచ్చరిక
  • రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగడం అవసరమని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల విభజన అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై ఇటీవల కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని లేఖలో పొన్నం ఆందోళన వ్యక్తం చేశారు. విభజనను తప్పుబడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు చేస్తున్న ప్రకటనలు సముచితంగా లేవని... ఇవి ప్రజల మధ్య విద్వేషాలను రగిలించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.


ముఖ్యంగా, లోక్‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆ వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేలా చంద్రబాబు చొరవ తీసుకోవాలని, ఈ మేరకు స్పీకర్‌కు లేఖ రాయాలని కోరారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు, తన మిత్రపక్ష నేతలకు సర్దిచెప్పి ఇలాంటి సున్నితమైన అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూడాలని అన్నారు.


రాష్ట్రం విడిపోయి దశాబ్ద కాలం గడిచినా, ఇంకా పాత గాయాలను రేపేలా మాట్లాడటం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని మంత్రి స్పష్టం చేశారు. "రెండు రాష్ట్రాలు పాత విభేదాలను పక్కనపెట్టి, పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో సాగడం తక్షణ అవసరం" అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు తన వినతిని అర్థం చేసుకుని, సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Go Back to Shorts
Ponnam Prabhakar
Congress
Chandrababu
TDP

More Telugu News