ప్రకాశ్ రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి

Karate Kalyani files complaint against Prakash Raj
  • రాముడిపై ప్రకాశ్ రాజ్ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణ
  • పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల వీడియో లింక్ పోలీసులకు అందజేత
  • ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై సినీ నటి, బీజేపీ నేత కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరాముడు, రామాయణంపై ప్రకాశ్ రాజ్ అవమానకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. వెంటనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ శ్రీరాముడిని, పవిత్ర రామాయణాన్ని కించపరిచారని కల్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రామాయణాన్ని బీఫ్ తినడంతో పోల్చడం ద్వారా హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించారు. తాను నిర్వహిస్తున్న "నిర్దిగంత" అనే థియేటర్ సంస్థ ద్వారా పిల్లల చేత హిందూ వ్యతిరేక నాటకాలు వేయిస్తూ, వారిని బ్రెయిన్‌వాష్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వలస కూలీలని, రావణుడు అనే గిరిజన భూస్వామి పొలంలో పండ్లు దొంగిలించారని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించినట్లు కల్యాణి తెలిపారు. పండ్లకు డబ్బులు చెల్లించలేదన్న చిన్న గొడవ వల్లే రామాయణ యుద్ధం జరిగిందని చెప్పడం ద్వారా ఆయన రామాయణాన్ని అవమానించారని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో లింక్‌ను కూడా పోలీసులకు అందజేశారు. ప్రకాశ్ రాజ్‌పై భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కల్యాణి తన ఫిర్యాదులో కోరారు. ఆ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కూడా విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Karate Kalyani
Prakash Raj
Lord Shri Ram
Ramayana
Police
Hyderabad

More Telugu News