కేరళలో భారీగా పోలింగ్... మధ్యాహ్నానికే 50 శాతం ఓటింగ్

కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ హోరాహోరీగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయానికే రాష్ట్రంలోని 2.71 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 50 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఈసారి పోలింగ్ శాతం సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.

సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుండగా, తుది ఓటింగ్ శాతం '80%' మార్కును దాటుతుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1987 తర్వాత కేరళలో పోలింగ్ 80 శాతం దాటలేదు. ఎన్నికల ప్రధానాధికారి రతన్ యు. ఖేల్కర్ ఈసారి 85 శాతం పోలింగ్‌ను లక్ష్యంగా నిర్దేశించారు. 1960లో నమోదైన 85 శాతమే ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ఆల్ టైమ్ రికార్డు.

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ సరళిలో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. పినరయి విజయన్ తొలిసారి అధికారంలోకి వచ్చిన 2016 ఎన్నికల్లో 77 శాతం, ఆయన రెండోసారి గెలిచిన 2021లో 75 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి ఉదయం నుంచే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

సాధారణంగా కేరళలో పోలింగ్ శాతం పెరిగితే ఫలితాలు అనూహ్యంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. ఈ నేపథ్యంలో పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి లాభిస్తుందనే దానిపై ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఓటర్లలో పెరిగిన చైతన్యం, హోరాహోరీగా సాగిన ప్రచారమే ఈ భారీ ఓటింగ్‌కు కారణంగా కనిపిస్తోంది.

Kerala Elections
Kerala Assembly Elections
Kerala Voting
Pinarayi Vijayan
Kerala Politics
Election Percentage
Ratan U Khelkar
Kerala Election 2024
Assembly Elections

More Telugu News