వైద్య విద్యార్థులకు పీఐబీ అలర్ట్.. ఆ లేఖలో నిజం లేదు!

నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరుతో 'నేషనల్ ఎగ్జిట్ టెస్ట్' (NExT) పరీక్షపై సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న ఓ లేఖ నకిలీదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. వైద్య విద్యార్థులు, కళాశాలలు ఇటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని హెచ్చరించింది.

వివరాల్లోకి వెళ్తే, ఎన్ఎంసీ పేరుతో ఏప్రిల్ 1వ తేదీతో ఉన్న ఓ లేఖ దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. 2022 బ్యాచ్ నుంచి ఎంబీబీఎస్ విద్యార్థులకు 'నెక్స్ట్' పరీక్షను అమలు చేస్తున్నట్లు ఆ లేఖలో తప్పుగా పేర్కొన్నారు. ఫైనల్ ఇయర్ అర్హత పరీక్షగా, వైద్య ప్రాక్టీస్‌కు లైసెన్స్ పరీక్షగా, నీట్-పీజీ ప్రవేశ పరీక్ష స్థానంలో ఈ పరీక్ష ఉంటుందని అందులో తెలిపారు. రెండు దశల్లో ఈ పరీక్ష ఉంటుందని కూడా వివరించారు.

ఈ లేఖ వల్ల విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందం మంగళవారం ఈ లేఖను పరిశీలించి, ఇది పూర్తిగా నకిలీదని తేల్చింది. ఎన్ఎంసీ నుంచి 'నెక్స్ట్' పరీక్ష అమలుపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదని స్పష్టం చేసింది. వైద్య విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఇలాంటి ఫేక్ సర్క్యులర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సమాచారం కోసం కేవలం ఎన్ఎంసీ వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని సూచించింది.
 

National Medical Commission
NMC
National Exit Test
NExT
fake news
PIB Fact Check
MBBS students
medical education
fake circular
medical colleges

More Telugu News