కేరళలో బీజేపీ 'జీరో సీట్ల పార్టీ'... ఆ పార్టీకి ఓటు వేస్తే వృథా: శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

Shashi Tharoor Says BJP Zero Seat Party in Kerala
షార్ట్స్‌లో చూడండి
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఒక 'జీరో సీట్ల పార్టీ' అని, ప్రస్తుతం అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆ పార్టీ అద్భుతం చేసి ఒకటి, రెండు లేదా మూడు సీట్లు గెలిచినా, ప్రభుత్వం ఏర్పాటులో మాత్రం బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో తరచూ పర్యటిస్తున్నప్పటికీ, ఆ ప్రభావం రాష్ట్ర ఎన్నికలపై ఉండదని అన్నారు. "ప్రధాని మోదీ ఇక్కడ ముఖ్యమంత్రి కారు కదా అని ప్రజలకు బాగా తెలుసు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి లభించే ఆదరణ, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించదు" అని థరూర్ విశ్లేషించారు.

ఈ నేపథ్యంలో, వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్) ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఓట్లను బీజేపీకి వేసి వృథా చేసుకోవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మార్పు కోరుకునేవారు యూడీఎఫ్‌కు ఓటు వేయాలని, తద్వారా బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈసారి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎల్డీఎఫ్ ప్రభుత్వ పాలనను థరూర్ తప్పుబట్టారు. గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనలో తామే ప్రగతి సాధించామని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. గతంలో ఊమెన్ చాందీ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధించిందని గుర్తుచేశారు. వామపక్షాలు వ్యతిరేకించినప్పటికీ, విళింజం పోర్టు వంటి కీలక ప్రాజెక్టులను యూడీఎఫ్ హయాంలోనే ప్రారంభించామని తెలిపారు. వయనాడ్‌లో విపత్తుల నిర్వహణలోనూ ప్రభుత్వం విఫలమైందని, విపత్తులు సంభవించినప్పుడు బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వానిదేనని అన్నారు.

ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అడిగిన ప్రశ్నకు, అది పూర్తిగా ఊహాజనితమని థరూర్ కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక స్పష్టమైన ప్రక్రియ ఉందని, ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్ఠానం కలిసి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తాయని తెలిపారు. కేరళలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.
Go Back to Shorts
Shashi Tharoor
Kerala Assembly Elections
BJP Kerala
LDF Government
UDF Kerala
Pinarayi Vijayan
Oommen Chandy
Kerala Politics
Indian National Congress
Narendra Modi

More Telugu News