Donald Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. విదేశీ మందులపై 100 శాతం సుంకం.. భారత కంపెనీలపై దీర్ఘకాలిక ప్రభావం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫార్మా రంగంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశీయ భద్రత, సరఫరా వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలను కారణంగా చూపుతూ.. విదేశాల నుంచి దిగుమతి అయ్యే కొన్ని పేటెంట్ ఔషధాలపై 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలోనే మందుల తయారీని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ పరిణామం ప్రపంచ ఫార్మా మార్కెట్‌తో పాటు, భారత కంపెనీల భవిష్యత్తుపైనా ఆందోళన కలిగిస్తోంది.

కొత్త ఆదేశాలు ఏం చెబుతున్నాయి?
ట్రంప్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం విదేశాల నుంచి దిగుమతి అయ్యే పేటెంట్ లేదా బ్రాండెడ్ ఔషధాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు వర్తిస్తాయి. అయితే, అమెరికా ప్రభుత్వంతో "మోస్ట్ ఫేవర్డ్ నేషన్" ధరల ఒప్పందం కుదుర్చుకుని, అమెరికాలో తయారీ యూనిట్లను నిర్మిస్తున్న కంపెనీలకు సుంకాల నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. ధరల ఒప్పందం చేసుకోకపోయినా, అమెరికాలో తయారీ ప్రాజెక్టులు చేపడుతున్న కంపెనీలకు 20 శాతం సుంకం విధిస్తారు. నాలుగేళ్లలో ఈ సుంకం 100 శాతానికి పెరుగుతుంది. ఒప్పందాలు చేసుకోని పెద్ద కంపెనీలకు 120 రోజులు, ఇతర కంపెనీలకు 180 రోజుల గడువు ఇచ్చారు. ఈ లోపు ఒప్పందాలు చేసుకోకపోతే 100 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే 17 ప్రముఖ ఫార్మా కంపెనీలతో ధరల ఒప్పందాలు కుదిరినట్లు, వాటిలో 13 కంపెనీలు సంతకాలు చేసినట్లు వైట్‌హౌస్ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం అమెరికాలో పంపిణీ అవుతున్న పేటెంట్ ఔషధాల్లో దాదాపు 53 శాతం విదేశాల్లోనే తయారవుతున్నాయని, కేవలం 15 శాతం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అవుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడితే, ప్రాణాలను రక్షించే మందుల కొరత ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, ఆటో ఇమ్యూన్ సమస్యల చికిత్సలో వాడే కీలక ఔషధాల కోసం దేశీయంగానే పటిష్ఠమైన తయారీ వ్యవస్థ ఉండాలని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది.

భారత్‌పై ప్రభావం ఎంత?
ప్రస్తుతానికి ఈ ఆదేశాల వల్ల భారత ఫార్మా రంగానికి తక్షణ ముప్పు లేదు. ఎందుకంటే, జెనరిక్ మందుల తయారీలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ట్రంప్ ఆదేశాల నుంచి జెనరిక్స్, బయోసిమిలర్స్, అత్యవసర మందులకు మినహాయింపు ఇచ్చారు. దీంతో అమెరికాకు తక్కువ ధరకే మందులను ఎగుమతి చేస్తున్న భారత కంపెనీల వ్యాపారం యథావిధిగా కొనసాగనుంది.

అయితే, దీర్ఘకాలంలో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. పేటెంట్ మందులు, ఏపీఐలపై భారీ సుంకాలు విధించడం వల్ల భవిష్యత్తులో పెట్టుబడులు అమెరికాకు తరలిపోయే ప్రమాదం ఉంది. భారత్ వంటి తయారీ కేంద్రాల నుంచి కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికాకు మార్చేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. అంతేగాక‌ ఏడాది తర్వాత జెనరిక్ దిగుమతులపై కూడా జాతీయ భద్రత కోణంలో సమీక్ష జరుపుతామని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఇది అమలైతే కాంప్లెక్స్ జెనరిక్స్, స్పెషాలిటీ ఇంజెక్టబుల్స్, బయోసిమిలర్స్‌పై ప్రభావం పడుతుంది. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, బయోకాన్ వంటి భారతీయ కంపెనీలు అమెరికాలో పేటెంట్ మందులను విక్రయిస్తున్నందున, భవిష్యత్తులో ధరల ఒత్తిడిని లేదా మరిన్ని నిబంధనలను ఎదుర్కోవచ్చు.
Donald Trump
Trump pharma
US pharma tariffs
Indian pharma
pharma industry
generic drugs
API
drug imports
pharmaceuticals
drug manufacturing

More Telugu News