Nokia: నోకియాలో భారీగా ఉద్యోగాల కోత.. 14,000 మంది తొలగింపు

ఒకప్పుడు మొబైల్ ఫోన్ల మార్కెట్‌లో రారాజుగా వెలిగిన ఫిన్‌లాండ్ టెక్ దిగ్గజం నోకియా, ఇప్పుడు భారీగా ఉద్యోగుల కోతకు సిద్ధమైంది. తన గ్లోబల్ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 14,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌పైనా గణనీయంగా పడనుంది.

ఈ నేపథ్యంలో భారత్‌లోని నాయకత్వ బృందంలోనూ నోకియా కీలక మార్పులు చేసింది. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి సమర్ మిట్టల్‌ను ఇండియా కంట్రీ బిజినెస్ లీడర్‌గా, విభ మేహ్రాను ఇండియా కంట్రీ మేనేజర్‌గా నియమించింది. ఇప్పటివరకు ఇండియా హెడ్‌గా ఉన్న తరుణ్ ఛబ్రా తన పదవి నుంచి తప్పుకున్నారు.

భారత్‌లో అమ్మకాలు పడిపోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2025 నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాలు 15 శాతం తగ్గి 393 మిలియన్ యూరోలకు చేరాయి. దీనికితోడు, 2023లో క్లౌడ్, నెట్‌వర్క్ సర్వీసులను మొబైల్ నెట్‌వర్క్స్‌తో విలీనం చేయడం వల్ల ఒకే పనికి ఇద్దరు ఉద్యోగులున్న పరిస్థితి (డూప్లికేషన్) ఏర్పడింది. దీన్ని సరిదిద్దేందుకే తాజా తొలగింపులు చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

గత ఎనిమిదేళ్లుగా నోకియా తన ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. 2018లో 1,03,000గా ఉన్న సిబ్బంది, ప్రస్తుతం 74,100కి తగ్గారు. ప్రస్తుతం భారత్‌లో కంపెనీకి 17,000 మంది ఉద్యోగులు ఉన్నారు. టెక్ రంగంలో ఈ తరహా లేఆఫ్స్ నోకియాకు మాత్రమే పరిమితం కాలేదు. దాని ప్రధాన పోటీదారు ఎరిక్సన్ కూడా గత ఏడాది 5,000 మందిని తొలగించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి బడా టెక్ కంపెనీలు సైతం ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Nokia
Nokia layoffs
job cuts
Samar Mittal
Vibha Mehra
Tarun Chhabra
Ericsson
mobile networks
telecommunications
India

More Telugu News