కిమ్‌కు తుపాకీ గిఫ్ట్... "శత్రువులు కనిపిస్తే వాడండి" అంటూ బెలారస్ అధ్యక్షుడు సరదా వ్యాఖ్యలు

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఓ ఆటోమేటిక్ రైఫిల్‌ను బహుమతిగా ఇచ్చారు. ప్యాంగ్‌యాంగ్‌లో తొలిసారి పర్యటించిన లుకాషెంకో.. "శత్రువులు కనిపిస్తే అవసరం పడుతుంది" అని ఈ సందర్భంగా సరదాగా వ్యాఖ్యానించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను బెలారస్ అధికారిక మీడియా గురువారం వెల్లడించింది.

ఈ పర్యటన సందర్భంగా ఇరు నేతలు 'స్నేహం, సహకారం' ఒప్పందంపై సంతకాలు చేశారు. బెలారస్ మీడియా విడుదల చేసిన వీడియోలో.. లుకాషెంకో రైఫిల్‌ను కిమ్‌కు అందిస్తుండగా, దానిని అందుకున్న కిమ్ మాక్ రీలోడింగ్ చేసినట్టు సైగ చేసి "థాంక్యూ" చెప్పారు. దీనికి లుకాషెంకో "అవును, శత్రువులు కనిపిస్తే ఉపయోగపడుతుంది" అనడంతో కిమ్ నవ్వారు. ప్రతిగా కిమ్ జాంగ్ ఉన్ కూడా లుకాషెంకోకు ఒక ప్రత్యేక బహుమతి ఇచ్చారు. సుమారు 30 సముద్రపు గుల్లలతో తయారు చేసిన, లుకాషెంకో చిత్రం ఉన్న ఒక మొజాయిక్ ఫ్లవర్ వాజ్‌ను బహూకరించారు.

ఈ సమావేశంలో ఇద్దరు నేతలు పశ్చిమ దేశాలపై విమర్శలు గుప్పించారు. బెలారస్‌పై పశ్చిమ దేశాలు విధిస్తున్న 'అక్రమ ఒత్తిడి'ని ఉత్తర కొరియా వ్యతిరేకిస్తోందని కిమ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలను కొన్ని ప్రపంచ శక్తులు ఉల్లంఘిస్తున్నాయని లుకాషెంకో ఆరోపించారు.

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు ఈ రెండు దేశాలు మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేస్తుండగా, 2022లో దాడికి బెలారస్ తన భూభాగాన్ని లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగించుకునేందుకు అనుమతించింది. పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ రష్యా, చైనాలతో కలిసి 'బహుళ ధ్రువ ప్రపంచం' కోసం పనిచేస్తున్నామని ఇరు నేతలు పునరుద్ఘాటించారు. పర్యటన ముగింపులో కిమ్ స్వయంగా విమానాశ్రయం వరకు వచ్చి లుకాషెంకోకు ఆత్మీయ వీడ్కోలు పలికారు.




More Telugu News