అబుదాబిపై ఇరాన్ క్షిపణి దాడి .. శకలాలు మీద పడి భారతీయుడి మృతి

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు విషాదానికి దారితీశాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో గురువారం జరిగిన ఓ ఘటనలో ఒక భారత జాతీయుడు ప్రాణాలు కోల్పోయారు. మరొక భారతీయుడు గాయపడ్డారు. గగనతలంలో పేల్చివేసిన బాలిస్టిక్ క్షిపణికి చెందిన శకలాలు జనావాసాలపై పడటంతో ఈ ఘోరం జరిగింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

ఈ ఘటనపై అబుదాబి మీడియా ఆఫీస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు ఓ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా అడ్డగించి కూల్చివేశాయని తెలిపింది. అయితే, ఆ క్షిపణి శకలాలు అబుదాబిలోని స్వీహాన్ వీధిలో పడ్డాయని పేర్కొంది. ఈ ప్రమాదంలో ఒక భారత, ఒక పాకిస్థాన్ జాతీయుడు మరణించారని ధృవీకరించింది. గాయపడిన ముగ్గురిలో ఒక యూఏఈ, ఒక జోర్డాన్, ఒక భారత జాతీయుడు ఉన్నారని, వారికి చికిత్స అందిస్తున్నామని వివరించింది. ఈ ఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28 నుంచి మొదలైన ఘర్షణల పర్యవసానంగానే ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు సైనిక ఉన్నతాధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలు, వారి మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతోంది.

ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణి, డ్రోన్ ముప్పులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వినిపిస్తున్న భారీ శబ్దాలు క్షిపణులను అడ్డగించడం వల్లే వస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ప్రజలు అనవసరపు వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని అబుదాబి అధికారులు విజ్ఞప్తి చేశారు.


More Telugu News