మోత ప్రారంభం.. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన నయారా
పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా క్రూడాయిల్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్న తరుణంలో, దేశీయంగా ఇంధన ధరల సెగ మొదలైంది. ముఖ్యంగా ప్రైవేట్ చమురు దిగ్గజం నయారా ఎనర్జీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వాహనదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. రష్యాకు చెందిన 'రాస్నెఫ్ట్' భాగస్వామ్యం ఉన్న ఈ సంస్థ... పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టింది.
నయారా ఎనర్జీ దేశ వ్యాప్తంగా ఉన్న తన 7,000 అవుట్లెట్లలో లీటరు పెట్రోల్పై రూ. 5, డీజిల్పై రూ. 3 వరకు ధరలను పెంచింది. కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ ప్రభావంతో ఈ పెంపు రూ. 5.30 కి కూడా చేరింది. ఇండస్ట్రియల్ డీజిల్ ధరను లీటరుకు ఏకంగా రూ. 22 పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల అస్థిరత, సప్లై చైన్ సమస్యలనే కారణాలుగా చూపుతూ ఈ పెంపును తక్షణమే అమలులోకి తెచ్చారు.
అయితే, ఊరట కలిగించే విషయం ఏంటంటే... మార్కెట్లో 90 శాతం వాటా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, మరో ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్-బీపీ ప్రస్తుతానికి సాధారణ ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి.
యుద్ధం ముదురుతున్న కొద్దీ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా రేట్లను పెంచుతాయేమోనన్న భయంతో వాహనదారులు బంకుల వద్ద క్యూ కడుతున్నారు. పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో ముగియకపోతే దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఎక్కడికో వెళతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.